చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ముందుగా బౌలింగ్ చేయడం వల్ల పిచ్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని, అది బ్యాటింగ్ను సులువు చేస్తుందని చెప్పాడు.
పాయింట్స్ టేబుల్లో టాపర్గా నిలిచామని తాము ఎక్కడా రిలాక్స్ కాలేదని, గుడ్ క్రికెట్ ఆడటంపైనే ఫోకస్ పెట్టామని తెలిపాడు. తమది చాలా తెలివిగల జట్టని, ఒకే విధానంలో తాము ఆడదలుచుకోవడం లేదని, పరిస్థితులకు తగ్గట్లు తమ ఆటను మార్చుకోవాలనుకుంటున్నామని చెప్పాడు. యశ్ దయాల్ స్థానంలో దర్శన్ నలకందే జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమనిచెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్కు చేజింగ్లో తిరుగులేదని, మంచి రికార్డు ఉందని చెప్పాడు. 'మేం ఇక్కడి పరిస్థితులను మెరుగ్గా ఉపయోగించుకున్నాం. ఈ టోర్నీలో మా ఆటగాళ్లు పరిస్థితులను బాగానే అందిపుచ్చుకున్నారు.
అయితే మన బలాలకు తగ్గట్లు ఆడటం చాలా ముఖ్యం. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలి. మా ఆటగాళ్లు ఇవన్నీ చేయగలిగారు కాబట్టే మేం ఈ మ్యాచ్ ఆడుతున్నాం. ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్లో చాలా డ్యూ వచ్చింది. అయితే గాలులు వీస్తుండటంతో ఈ రోజు తేమ ప్రభావం ఉంటుందా? లేదా? అని చెప్పలేం. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగుతున్నాం.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డసన్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మహీశ్ తీక్షణ