అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కు అడుగు దూరంలో గుజరాత్ టైటాన్స్ నిలవగా.. 8 మ్యాచ్ల్లో రెండు మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో కొనసాగుతోంది.
టేబుల్ టాపర్.. లాస్ట్ ప్లేస్ టీమ్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బలబలాల పరంగా గుజరాత్ టైటాన్స్దే పై చేయి కాగా.. ఢిల్లీ ఏమేరకు పోరాడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో పటిష్టంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ సమష్టిగా రాణిస్తూ విజయాలందుకుంటోంది. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా మ్యాచ్కు ఒకరు విన్నర్గా నిలుస్తుండటంతో ఆ జట్టుకు తిరుగులేదు.

జట్టులో కూడా మార్పులు చేయాల్సిన అవసరం గుజరాత్ టైటాన్స్కు లేదు. అయితే కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో క్యాచ్ అందుకునే క్రమంలో వెటరన్ పేసర్ మోహిత్ శర్మ గాయపడ్డాడు. అతను ఫిట్గా లేకుంటే మాత్రం శివమ్ మావి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఒక్కటి మినహా జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు.
ఓపెనర్లు వృద్దిమాన్ సాహా, శుభ్ మన్ గిల్ అదిరిపోయే ఆరంభం అందిస్తుండగా.. హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్ మిడిలార్డర్లో సత్తా చాటుతున్నారు. ఫినిషర్లుగా డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాటియాకు తిరుగులేదు. స్పిన్నర్ రషీద్ ఖాన్ అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోష్ లిటిల్ పేస్ బాధ్యతలు మోస్తుండగా.. నూర్ అహ్మద్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా సత్తా చాటుతున్నాడు. శ్రీలంక ప్లేయర్ డసన్ షనక, వెస్టిండీస్ ప్లేయర్ అల్జారీ జోసెఫ్ ఈ మ్యాచ్కు కూడా బెంచ్కే పరిమితం కానున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడే గుజారత్ టైటాన్స్ తుది జట్టు(అంచనా)
వృద్దిమాన్ సాహా, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ/ శివమ్ మావి, జోషువా లిటిల్.