ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లక్నో వేదికగా ఆదివారం జరిగిన ఈ డే గేమ్లో ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే, గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.
హర్షా భోగ్లే అడిగిన ఓ ప్రశ్నకు విక్రమ్ సోలంకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ గురించి మాట్లాడుకుందామని చురకలంటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 9వ ఓవర్లో విక్రమ్ సోలంకిని హర్షా భోగ్లే ఇంటర్వ్యూ చేస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విక్రమ్ సోలంకిని ఫిట్గా, కుర్రాడిలా కనిపిస్తున్నారని హర్షా భోగ్లే సరదాగా అన్నాడు.
ఈ వ్యాఖ్యలకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అయిన సోలంకి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. 'మనం కేవలం క్రికెట్ గురించి, మైదానంలో ఉన్న ఆటగాళ్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటే బాగుంటుంది.’అని హర్షా భోగ్లే నోరు మూయించాడు. హర్షా భోగ్లే సరదాగానే అడిగినా..సోలంకి సీరియస్ అయ్యారు. ఈ సంభాషణ సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 30) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(4/28) నాలుగు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించగా.. అశోక్ శర్మ(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబడాకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్మన్ గిల్(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 56), జోస్ బట్లర్(37 బంతుల్లో 11 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రతి తలో వికెట్ తీసారు.