నేను తప్పని నిరూపించాడు..
'అందరికంటే ఎక్కువగా మ్యాక్స్వెల్ నన్ను ఆశ్చర్యపరిచాడు. వేలంలో బెంగళూరు ఫ్రాంఛైజీ అతని కోసం మరీ ఎక్కువ మొత్తం ఖర్చు చేసిందనుకున్నా. కానీ నా అభిప్రాయం తప్పని అతను నిరూపించాడు. టీమ్మేనేజ్మెంట్ సైతం తనకు స్వేచ్చగా ఆడే అవకాశాన్నించింది. అతనిపై పూర్తి నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. వైఫల్యాల నుంచి బయటపడి పూర్వపు ఫాంలోకి వచ్చాడు. మంచి మంచి షాట్లు ఆడుతున్నాడు. ఇప్పుడు అతను చాలా సంతోషంగా ఉండి ఉంటాడు. ప్రస్తుతం మాక్సీ పూర్తి ఫిట్గా ఉన్నాడు. కాబట్టి మరింత విజయవంతంగా కొనసాగే అవకాశం ఉంది.
సరైన జట్టులో పడ్డాడు..
అదే విధంగా, కోహ్లీ, డివిలియర్స్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నపుడు మాక్స్వెల్ తన సహజమైన ఆటతీరును ప్రదర్శించేందుకు మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అతని ప్రదర్శనను బిగ్ షోగా, బిగ్ మ్యాక్ ఇలా ఏదైన పేరుతో పిలవవచ్చు. అతిత్వరంలోనే జట్టులో మూడో కీలక ఆటగాడిగా మ్యాక్సీ ఎదుగుతాడు. ఆర్సీబీ అతనికి సరిగ్గా సరిపోయే జట్టు. ఇన్ని జట్లు తిరిగిన అతను చివరకు అతనికి సూట్ అయ్యే టీమ్లోకే వచ్చాడు.'అని గ్రేమ్ స్వాన్ చెప్పుకొచ్చాడు.
బ్యాట్తోనే సమాధానం..
గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మాక్స్వెల్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్లు ఆడి కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.
దాంతో పంజాబ్ అతన్ని వదులుకోగా.. ఫిబ్రవరిలో జరిగిన ఈ సీజన్ మినీ వేలంలో ఆర్సీబీ రూ. 14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో టీమ్మేనేజ్మెంట్ నిర్ణయం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. గత సీజన్లో విఫలమైన ఆటగాడి కోసం భారీ మొత్తం వెచ్చించడం పట్ల రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇక మాక్సీ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా బ్యాట్తోనే ఆ విమర్శలకు సమాధానం ఇస్తున్నాడు.
మ్యాక్సీమమ్ బాదేశాడు..
కోల్కతా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ రాణించారు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి ఓడిపోయింది. ఆండ్రూ రసెల్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఇయాన్ మోర్గాన్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్లు), షకీబుల్ హసన్ (25 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) జట్టు విజయం కోసం విఫలయత్నం చేశారు.