ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు కాదు
త్వరలోనే ఇంగ్లండ్ టీమ్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో గ్రేమ్ స్వాన్ మీడియాతో మాట్లాడాడు. 'ఇంగ్లండ్ టీమ్ ఇంతకుముందు ఎప్పుడూ యాషెస్ సిరీస్ గురించే మాట్లాడేది. అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం అత్యుత్తమ జట్టు కాదు. అది గతంలోని మాట. కానీ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆ జట్టుతో యాషెస్ సిరీస్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇకపై అది మర్చిపోయి ముందుకుసాగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాను వారి సొంత గడ్డపై ఓడించడం అన్నింటికన్నా పెద్ద సవాల్. 2012లో భారత పర్యటన సందర్భంగా టీమిండియాను ఇంగ్లండ్ ఓడించింది. ఆ తర్వాత భారత్ బలంగా మారింది' అని స్వాన్ అన్నాడు.
టీమిండియాపై దృష్టి పెట్టాలి
'ఇంగ్లండ్ ఇప్పుడు నంబర్ వన్ జట్టుగా ఎదగాలంటే.. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించాలనే విషయాన్ని వదిలేసి టీమిండియాపై దృష్టి పెట్టాలి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకొని.. టీమిండియాపై స్పిన్ బౌలింగ్తో విరుచుకుపడాలి. అప్పటి పర్యటనలో కెవిన్ పీటర్సన్ ఎలా ఆడాడో అలాంటి ప్రదర్శన చేయాలి. ఇంగ్లీష్ స్పిన్నర్లు వికెట్లు తీయలేనంత కాలం భారత్ను సొంత గడ్డపై ఓడించడం కష్టం. ఆ పర్యటనలో పీటర్సన్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. అతడెంతో దూకుడుగా ఆడాడు. అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అతడి ఆటను ఒక ఉదాహరణలా తీసుకొని ఉత్తమ ప్రదర్శన చేయాలి' అని గ్రేమ్ స్వాన్ సూచించాడు.
స్వీట్ వార్నింగ్
ఇంగ్లీష్ ఆటగాళ్లకు గ్రేమ్ స్వాన్ సూచనలు ఇస్తుంటే.. కెవిన్ పీటర్సన్ మాత్రం ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆసీస్ సిరీస్ విజయాన్ని భారత్ మరీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవద్దని, త్వరలోనే ఇంగ్లండ్ జట్టు వస్తుందన్నాడు. 'టీమిండియా.. ఆస్ట్రేలియాపై గెలిచిన చారిత్రక విజయాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే.. ఇది ఎన్నో అడ్డంకుల మధ్య సాధించిన విజయం. అయితే అసలు సవాలు మీకు కొన్ని వారాల్లో ఎదురు కాబోతోంది. ఇంగ్లండ్ జట్టు భారత్ వస్తోంది. ఇంగీష్ టీమ్ను మీ సొంతగడ్డపై ఓడించాల్సి ఉంటుంది. జర జాగ్రత్త.. ఈ రెండు వారాల్లో మరీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవద్దు' అని కెవిన్ పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశాడు.
స్టోక్స్, ఆర్చర్ ఆగయా
భారత్తో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 16 మంది ప్లేయర్లతో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు దూరమైన బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్.. భారత్తో సిరీస్లో బరిలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత పర్యటనలో నాలుగు టెస్ట్లు, ఐదు టీ20లు, మూడు వన్డేలను ఇంగ్లండ్ ఆడనుంది.