బరోడా: బరోడా టీమ్ వైస్ కెప్టెన్ దీపక్ హుడాకు భారీ షాక్ తగిలింది. దేశవాళీ ప్రధాన టీ20 టోర్నీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభానికి ముందు కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవపడి బరోడా టీమ్ని వీడిన దీపక్ హుడాపై బరోడా క్రికెట్ అసోషియేషన్ (బీసీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం జరుగుతన్న టోర్నీ నుంచి అతడిని బీసీఏ సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని బీసీఏ చైర్మన్ సత్యజిత్ గైక్వాడ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
'ప్రస్తుతం జరుగుతన్న దేశీయ సీజన్లో దీపక్ హూడా బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించరాదని సుప్రీం కౌన్సిల్ నిర్ణయించింది. బరోడా జట్టు మేనేజర్ మరియు కోచ్ల నివేదికలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు' అని బీసీఏ చైర్మన్ సత్యజిత్ గైక్వాడ్ తెలిపారు. 2021-22 సీజన్లో హుడా మళ్లీ బరోడా జట్టు తరఫున ఆడవచ్చు. హుడాకు పడిన శిక్ష కఠినంగా ఉందని బీసీఏ జాయింట్ సెక్రటరీ పరాగ్ పటేల్ అభిప్రాయపడ్డారు.
జనవరి 10 నుంచి ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్కి ముందు బరోడా టీమ్ కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవపడిన దీపక్ హుడా.. అసోషియేషన్ అనుమతి తీసుకోకుండా జట్టును వీడాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో-బబుల్ వాతావరణంలో ట్రోఫీని బీసీసీఐ నిర్వహిస్తుండగా.. క్రికెటర్ ముందస్తు అనుమతి లేకుండా బబుల్ నుంచి వెలుపలికి వెళ్లడానికి వీల్లేదు. టీమ్ని వీడిన తర్వాత పాండ్యాపై పెద్ద ఎత్తున హుడా ఆరోపణలు చేశాడు. టీమ్ మీటింగ్లో అందరి ముందు ఉద్దేశపూర్వకంగానే తనని కృనాల్ దూషించాడని, తన కెరీర్లో ఏ కెప్టెన్ నుంచి కూడా ఈ తరహా వేధింపులు ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కృనాల్-హుడా వివాదంపై టీమ్ మేనేజర్ని బరోడా క్రికెట్ అసోషియేషన్ పూర్తి స్థాయిలో రిపోర్ట్ని కోరింది. హుడా వివాదంపై పూర్తి స్థాయిలో తాజాగా విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోషియేషన్ అఫెక్స్ కౌన్సిల్.. హుడా క్రమశిక్షణ తప్పాడని తాజాగా తేల్చి ఈ సీజన్ దేశవాళీ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. బరోడా జట్టు తరఫున హుడా 46 ఫస్ట్ క్లాస్ మరియు 123 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్ 2020లో పంజాబ్ టీమ్కి ఆడిన విషయం తెలిసిందే.
IPL 2021: ఉతప్పని జట్టులోకి తీసుకున్న చెన్నై.. అందుకోసమేనా?