తన ఆకస్మిక రిటైర్మెంట్ వెనుక ఉన్న కారణాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎట్టకేలకు వెల్లడించాడు. వయసు మీద పడటంతో పాటు తుది జట్టులో చోటు దక్కక బెంచ్పై కూర్చోవాల్సి రావడం తనకు విసుగు తెప్పించిందని, దాంతోనే ఆటకు అల్విదా ప్రకటించానని చెప్పుకొచ్చాడు. 13 ఏళ్ల తన టెస్ట్ కెరీర్లో 106 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా నిలిచాడు. గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ సడెన్గా రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ పర్యటన మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అనేక సందేహాలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అశ్విన్.. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో జరిపిన ఇంటరాక్షన్లో స్పందించాడు. రాహుల్ ద్రవిడ్ ప్రశ్నకు సమాధానంగా తన రిటైర్మెంట్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు.

'వయసు పైబడటంతో పాటు రిటైర్మెంట్కు సరైన సమయమని నేను భావించాను. నా వ్యక్తిగత జీవితంలోనూ నేను ఉన్నత స్థితిలోనే ఉన్నాను. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా అవకాశం రాక బెంచ్పై కూర్చోవాల్సి రావడం నాకు విసుగు తెప్పించింది. జట్టుకు సహకరించడం ఇష్టం లేక కాదు, కానీ కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని గడపడం మంచిదనే ఆలోచన వచ్చింది.
ముఖ్యంగా నా పిల్లలతో ఎక్కువ సమయం గడుపాలనుకున్నా. వారు కూడా ఎదుగుతున్నారు. అంతేకాకుండా 34-35 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచన నా మనసులో నాటుకుపోయింది. ఇవన్నీ నా ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయానికి కారణమయ్యాయి.'అని రాహుల్ ద్రవిడ్కు అశ్విన్ వివరించాడు.