టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్.. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం సుమారు 12 కిలోల బరువు తగ్గాడు. ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని కూడా రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు.
ఈ విషయమై ముంబై జట్టుకు సమాచారమిచ్చాడని ఓ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ముంబై జట్టుకు అందుబాటులో ఉంటానని రోహిత్ శర్మ చెప్పినట్లు సదరు జర్నలిస్ట్ పేర్కొన్నాడు. డిసెంబర్లో జరిగే ఈ టోర్నీలో ముంబై ఆడే అన్ని లీగ్స్ మ్యాచ్ల్లో రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు. డిసెంబర్ 24, 26, 29, 31తో పాటు జనవరి 3, 6, 8 తేదీల్లో ముంబై ఆడే ఏడు లీగ్ మ్యాచ్ల్లో రోహిత్ ఆడనున్నాడు.

ఆ తర్వాత జరిగే దేశవాళీ టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రోహిత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టోర్నీలో నాకౌట్ మ్యాచ్లకు మాత్రమే రోహిత్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ముంబై నాకౌట్ చేరితే రోహిత్ ఆడుతాడు. లేదంటే బరిలోకి దిగడు. ఐపీఎల్ 2026 సీజన్కు లయ అందుకునేందుకు రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి వన్డేలో విఫలమైనా చివరి రెండు వన్డేల్లో 73, 121* హాఫ్ సెంచరీ, సెంచరీతో రాణించాడు. ఈ టోర్నీలో 202 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పాడు.
మరోవైపు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోహ్లీ, రోహిత్లను బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. 'భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని కోహ్లీ, రోహిత్లకు బీసీసీఐతో పాటు టీమ్మేనేజ్మెంట్ సూచించింది. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ ఆటగాళ్లు మ్యాచ్ ఫిట్నెస్తో పాటు ప్రాక్టీస్ సాధించేందుకు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరింది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాతో అన్నారు.