ఐపీఎల్ 2025 సీజన్ పున:ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులో చేరేందుకు సిద్దమయ్యాడు. భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో మే 17 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. అయితే కొంతమంది విదేశీ ఆటగాళ్లు తిరిగి భారత్కు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్ కూడా ఐపీఎల్ ఆగిపోగానే న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అతను తిరిగి రావడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దాంతో ముంబై ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఎందుకంటే ఈ సీజన్లో బౌల్ట్ దుమ్మురేపాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఈ ఇద్దరి అద్భుత ప్రదర్శనతోనే ముంబై వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఈ క్రమంలోనే బౌల్ట్ గైర్హాజరీ ముంబైకి తీరని నష్టం చేస్తుందని ఆ జట్టు ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. కానీ ట్రెంట్ బౌల్ట్ తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. రెండు రోజుల్లో అతను జట్టుతో కలిసి అవకాశం ఉందని ఓ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో బౌల్ట్ను ముంబై ఇండియన్స్ రూ. 12.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో బౌల్ట్ 8.49 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ రీషెడ్యూల్లో ముంబై తమ తొలి మ్యాచ్ను ఆర్సీబీతో బెంగళూరు వేదికగా తలపడనుంది. అయితే ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్ రాక సందేహంగా మారింది. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.
ఈ నెలాఖరు నాటికి సౌతాఫ్రికా ఆటగాళ్లంతా డబ్ల్యూటీసీ ఫైనల్కు సిద్దంగా ఉండాలని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ తిరిగి రావడం కూడా సందేహంగా మారింది. ఇంగ్లండ్, వెస్టిండీస్ వన్డే సిరీస్ నేపథ్యంలో అతను ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరంగా ఉండవచ్చు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టు చివరి రెండు మ్యాచ్లకు రెండు గెలవాల్సి ఉంది.