ఐపీఎల్ 2025 మెగా ఫైనల్పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్లలో తన మద్దతు ఎవరికో వెల్లడించాడు. మరికొద్ది సేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2025 మెగా ఫైనల్కు తెరలేవనుంది.
ఈ క్రమంలో ఆర్సీబీకి మద్దతు తెలుపుతు అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. ఆర్సీబీ టైటిల్ గెలవాలని ఆకాంక్షించాడు. 'మూడు దక్షిణ నగరాల(బెంగళూరు, చెన్నై, హైదరాబాద్) మధ్య ఎప్పుడూ అద్భుతమైన క్రికెట్ పోటీ ఉంటుంది. ఇందులో గొప్ప నగరమైన బెంగళూరు ఈ రాత్రి తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సీజన్లో విజేతగా నిలిచేందుకు వారు నిజంగా అర్హులు. గో ఆర్సీబీ.. టైటిల్ ఇంటికి తీసుకురండి!'అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు.

వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్కు డైహార్డ్ ఫ్యాన్ అయిన అంబటి రాయుడు.. గతంలో ఆర్సీబీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన మాటలతో ఆర్సీబీ ఫ్యాన్స్ను రెచ్చగొట్టాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచే సత్తా లేదని, ఆ జట్టు గెలవదని మాట్లాడాడు. కానీ ఈ సీజన్లో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో మాట మార్చిన రాయుడు.. ఆర్సీబీ అద్భుతంగా ఆడుతుందని, టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. తాజాగా ఆ జట్టు ఫైనల్ చేరడంతో మరోసారి తన మద్దతును తెలియజేశాడు.
ఐపీఎల్ వాయిదా పడే ముందు వరకు కామెంటేటర్గా వ్యవహరించిన రాయుడు.. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. వివాదాస్ప వ్యాఖ్యానంతోనే రాయుడిని కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఈ విషయంపై బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాయుడు కూడా స్పందించలేదు. ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్కు దూరంగా ఉండటం బీసీసీఐ లేదా బ్రాడ్కాస్టర్ తీసుకున్న నిర్ణయమా? స్వయంగా రాయుడు తీసుకున్న నిర్ణయమా? అనేదానిపై స్పష్టత లేదు. ఎక్స్వేదికగా కోహ్లీ రిటైర్మెంట్పై చివరి పోస్ట్ పెట్టిన రాయుడు.. తాజాగా ఆర్సీబీకి మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.