న్యూఢిల్లీ: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లేన్ మెక్గ్రాత్ తెలిపాడు. భారత్ కంటే పాకిస్థాన్కే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించగా.. ఆయా దేశాల విజ్ఞప్తి మేరకు ఒకటి రెండు మ్యాచ్ల తేదీలను మార్చే విషయంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జట్లన్నీ ప్రపంచకప్ ప్రిపరేషన్స్ ప్రారంభించాయి. టీమ్కాంబినేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో గ్లేన్ మెక్గ్రాత్ మెగా టోర్నీ ఫేవరేట్ టీమ్స్ వివరాలను వెల్లడించాడు.

సొంతగడ్డపై ఈ మెగా టోర్నీ జరుగుతుండటం భారత్కు కలిసొచ్చే అంశమే అయినా.. ప్రత్యర్థులకు కూడా పెద్దగా ఇబ్బంది ఏం ఉండదన్నాడు. ఐపీఎల్ కారణంగా ఇక్కడి పిచ్లపై ఆటగాళ్లకు పూర్తి అవగాహన వచ్చిందన్నాడు. 'సొంతగడ్డపై ప్రపంచకప్ జరుగుతుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అయితే ఐపీఎల్ కారణంగా ఇప్పుడు భారత్ ఆడేందుకు ఏ జట్లూ పెద్దగా భయపడటం లేదు.
ఐపీఎల్ కారణంగా ఇతర జట్ల ఆటగాళ్లకు భారత పిచ్లపై పూర్తి అవగాహన వచ్చింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్లో ఎక్కువగా ఆడుతున్నారు. ఈ అనుభవం వారికి ప్రపంచకప్ టోర్నీలో ఉపయోగపడనుంది. అందుకే ప్రపంచకప్ గెలిచే ఫెవరెట్స్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కచ్ఛితంగా ఉంటాయి.
అన్నింటికీ మించి పాకిస్థాన్కు ఈసారి వన్డే వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్, పేస్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఫీల్డింగ్లో మెరుగుపడితే పాకిస్థాన్కు తిరుగుండదు. నా అభిప్రాయం ప్రకారం భారత్ కంటే పాకిస్థాన్కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువ.

నా దృష్టిలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు వరల్డ్ కప్ టోర్నీలో ఫేవరేట్స్. భారత్లో పేసర్లకు పెద్దగా సహకారం లభించదు. ఇక్కడి పిచ్లు ప్రత్యేకంగా స్పిన్నర్ల కోసం తయారు చేసినట్టు ఉంటాయి. అయితే టీమిండియా నుంచి చాలా మంది యువ పేస్ బౌలర్లు వస్తున్నారు.
ఇంతకుముందు టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగంపై పెద్దగా ఫోకస్ పెట్టేది కాదు. ఇప్పుడు వారి ఆలోచన మారింది. భారత్లో ఫాస్ట్ బౌలర్గా సక్సెస్ అయితే.. ప్రపంచంలో ఏ దేశంలో అయినా వికెట్లు తీయవచ్చు.'అని గ్లేన్ మెక్గ్రాత్ చెప్పుకొచ్చాడు.