ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్ కూడా ఐపీఎల్కు గుడ్బై చెప్పాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి తన పేరును రిజిస్టర్ చేసుకోలేదని తెలిపాడు. క్రికెటర్గా ఎదిగేందుకు ఐపీఎల్ తనకు ఎంతో ఉపయోగపడిందని, వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో ఆడే అవకాశం దక్కిందని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ను పంచుకున్నాడు. ఐపీఎల్ అభిమానుల ప్రేమ వెల కట్టలేనిదని, తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ప్రస్తావించకపోయినా.. హింట్ ఇచ్చాడు.
'ఐపీఎల్లో ఎన్నో మరపురాని సీజన్స్ తర్వాత ఈ ఏడాది వేలంలో నా పేరును రిజిస్టర్ చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఈ లీగ్ నాకు ఇచ్చిన ప్రతిదానికీ ఎంతో కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఒక క్రికెటర్గా ఎదిగేందుకు నాకు ఐపీఎల్ ఎంతో ఉపయోగపడింది. వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో పాటు అద్భుతమైన ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించింది. క్రికెట్ అంటే ఎంతో అభిరుచి గల అభిమానుల ముందు ఆడే అవకాశాన్నిచ్చింది.

ఐపీఎల్లోని జ్ఞాపకాలు, సవాళ్లు, భారత అభిమానుల ఉత్సాహం నాతో శాశ్వతంగా ఉంటాయి. ఇన్నేళ్లుగా మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు. మళ్లీ త్వరలో కలుస్తామని ఆశిస్తున్నాను'అని మ్యాక్స్వెల్ తన పోస్ట్లో పేర్కొన్నాడు.
ఇప్పటికే ఆండ్రీ రస్సెల్, ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మ్యాక్స్వెల్ చేరాడు. వేలంలో అమ్ముడుపోమని గ్రహించే ఈ ముగ్గురు ఆటగాళ్లు మినీ ఆక్షన్కు దూరంగా ఉన్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2012లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన మ్యాక్స్వెల్ ముంబై ఇండియన్స్(2013), పంజాబ్ కింగ్స్ (2014-2017, 2020-21, 2025), ఢిల్లీ క్యాపిటల్స్(2018) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(2021-2024) మొత్తం నాలుగు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ నాలుగు జట్ల తరఫున 141 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ 23.88 సగటుతో 2819 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలున్నాయి. పంజాబ్ కింగ్స్ తరఫున గత సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ 48 పరుగులే చేసాడు. దాంతో ఆ జట్టు అతన్ని వేలంలోకి వదిలేసింది.