టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కారణంగానే పంజాబ్ కింగ్స్ జట్టు నాశనమైందని ఆ జట్టు మాజీ క్రికెటర్, ఆస్ట్రేలియా స్టార్ గ్లేన్ మ్యాక్స్వెల్ అన్నాడు. 2017 సీజన్లో సెహ్వాగ్.. పంజాబ్ కింగ్స్ డైరెక్టర్గా వ్యవహరించగా.. మ్యాక్స్వెల్ సారథిగా జట్టును నడిపించాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది.
టీమ్ డైరెక్టర్గా వీరేంద్ర సెహ్వాగ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతోనే జట్టు ఓటమిపాలైందని మ్యాక్స్వెల్ తన బుక్లో రాసుకొచ్చాడు. 'జట్టు సెలెక్షన్ విషయంలో కెప్టెన్గా వాట్సాప్ గ్రూప్లో కోచ్లందర్నీ భాగం చేయాలనుకున్నాను. టీమ్ కాంబినేషన్, వ్యూహాల విషయంగా సమష్టిగా నిర్ణయం తీసుకోవాలని భావించాను. ఈ ప్రతిపాదనకు సెహ్వాగ్ తప్పా అందరూ అంగీకరించారు. ఏకపక్షంగా సెహ్వాగ్ తుది జట్టును ఎంపిక చేశాడు. దాంతో మా జట్టు ప్రయాణం ఓటమి-గెలుపు అన్నట్లుగా సాగింది. సెహ్వాగ్ తీసుకున్న అనాలోచి నిర్ణయాలు జట్టుకు తీవ్ర నష్టం చేశాయి.

సీజన్ చివరి లీగ్ మ్యాచ్ ఓటమి అనంతరం మీడియా సమావేశానికి నేను హాజరవ్వాలనుకున్నాను. కానీ సెహ్వాగ్ నన్ను ఆపి తాను వెళ్తానన్నాడు. నేను టీమ్ ఎక్కేలోపు నన్ను జట్టు ప్రధాన వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. హోటల్ చేరే సరికి నా ఫోన్కు చాలా కాల్స్ వచ్చాయి. మీడియా సమావేశంలో సెహ్వాగ్ నన్ను బద్నాం చేశాడు. పంజాబ్ కింగ్స్ పరాజయానికి నేను కారణమని తెలిపాడు. కెప్టెన్గా బాధ్యత తీసుకోలేదని చెప్పాడు. ఆ మాటలు నన్ను షాక్కు గురి చేశాయి.
ఆ మాటలకు నేను చాలా బాధపడ్డానని సెహ్వాగ్కు మెసేజ్ చేశాను. తన మాటల వల్ల ఓ అభిమానిని కోల్పోయావని చెప్పాను. అందుకు సెహ్వాగ్.. 'మీలాంటి అభిమాని నాకు అవసరం లేదు'అని బదులిచ్చాడు. ఆ జట్టుతో నా ప్రయాణం ముగిసిందని నాకు అర్థమైంది. ఇదే విషయాన్ని టీమ్మేనేజ్మెంట్కు తెలియజేశాను. సెహ్వాగ్ను డైరెక్టర్గా పెట్టుకొని పంజాబ్ తప్పు చేసింది. అతన్ని మరో సీజన్ మాత్రమే కొనసాగించారు.'గ్లేన్ మ్యాక్స్వెల్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.
గతంలో సెహ్వాగ్ కూడా గ్లేన్ మ్యాక్స్వెల్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ను ఏ మాత్రం సీరియస్గా ఆడడని, వేకేషన్కు వచ్చినట్లు వచ్చి ఎంజాయ్ చేస్తాడని ఆరోపించాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన మ్యాక్సీ... 2020లో మళ్లీ పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. 2021 నుంచి 2023 వరకు ఆర్సీబీకి ఆడాడు.