
సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.14.25 కోట్ల భారీ ధరకు ఈ ఆసీస్ విధ్వంసకర ఆటగాడిని తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మ్యాక్సీ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతని నుంచి కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచుస్తున్నానని తెలిపాడు. అంతేకాకుండా తదుపరి ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత తన కెరీర్ మరోస్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'విరాట్ కోహ్లీ మల్టీ పెర్ఫార్మర్. ఫార్మాట్కు తగ్గట్లు ఆడే అసాధారణ ఆటగాడు. అతను గేమ్ను అందిపుచ్చుకున్నాడు. కొన్నేళ్లుగా తన ఆటతో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. అలాగే భారత కెప్టెన్గా, ఉత్తమ ఆటగాడిగా అతనిపై ఉన్న ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి ఇవన్నీ నేర్చుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అతను నెట్స్లో చెమటోడ్చే దగ్గరి నుంచి సారథ్యం వరకు అన్ని దగ్గరుండి పరిశీలించి, వీలైనంత నేర్చుకోవాలనుకుంటున్నాను. మానసిక ఒత్తిళ్లను జయించడానికి గతంలో కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని విరాట్ సమర్థించాడు. ప్రపంచ క్రికెటర్లందరికీ ఇది అవసరమని అతను సూచించాడు. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ ఒక శిఖరం'అని మాక్స్వెల్ చెప్పుకొచ్చాడు.
ఇక గత సీజన్లో మ్యాక్స్వెల్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్లు ఆడి కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. దాంతో పంజాబ్ కింగ్స్ అతన్ని వదులుకుంది. అయినా సరే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో మ్యాక్సీ గురించి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు ఆర్స్బీ రూ.14.25 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీ20 సిరీస్లో భాగంగా మ్యాక్స్వెల్ న్యూజిలాండ్లో ఉన్నాడు. భారత్-ఇంగ్లండ్ సిరీస్లు అనంతరం ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.