
పాక్ గెలవాలంటే
ఈరోజు రాత్రి జరిగే సూపర్ 12 మ్యాచులో పాక్ను టీమిండియా మట్టికరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీసేన అన్ని విభాగాల్లో బలంగా ఉండడం, గణాంకాలు కూడా టిమిండియాకే అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ఓ ఫన్నీ సలహాను పాకిస్థాన్ జట్టుకు ఇచ్చాడు.
భారత జట్టుపై పాక్ గెలవాలంటే మ్యాచ్కు ముందు టీమిండియా ఆటగాళ్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలని సూచించాడు. అంతేకాదు మెంటార్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని బ్యాట్ పట్టుకోకుండా చూసుకోవాలని పాక్ జట్టుకు సూచించాడు. అక్తర్ ఈ వ్యాఖ్యలను సరదాగానే చేసినా.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయ్యాయి.

టీమిండియా ప్లేయర్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలి
షోయబ్ అక్తర్ సోషల్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఆటపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎన్నో విషయాలు పంచుకుంటాడు. ఈ క్రమంలోనే చిరకాల ప్రత్యర్థులైన పాకిస్తాన్, భారత్ మ్యాచుపై అక్తర్ స్పందించాడు. ఓ క్రీడా ఛానెల్ నిర్వహించిన షోలో హార్బజన్ సింగ్, షోయబ్ అక్తర్ పాల్గొనగా.. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇద్దరూ సమాధానం చెప్పారు.
టీమిండియాని నిలువరించాలంటే పాకిస్తాన్ చేయాల్సిన మూడు పనులేంటి అని అక్తర్ను యాంకర్ అడగ్గా.. 'మొదటగా టీమిండియా ప్లేయర్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలి. రెండోది విరాట్ కోహ్లీ రెండు రోజులు ఇన్స్టాగ్రామ్ వాడకుండా చూడాలి. ఇక మూడోది ఏంటంటే.. ఇప్పటికీ అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఎంఎస్ ధోనీని బ్యాటింగ్కు రాకుండా చూసుకోవాలి' అని సరదాగా చెప్పాడు.

నవ్వేసిన హార్బజన్:
షోయబ్ అక్తర్ అలా చెప్పగానే హార్బజన్ సింగ్, యాంకర్ తెగ నవ్వేశారు. అదే ప్రశ్నను హర్భజన్ను ఆ యాంకర్ అడగ్గా.. 'మంచి ప్రారంభం కావాలి. మీ జోన్లో ఉంటూ తమదైన ఆట ఆడాలి. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనే ఒత్తిడికి ఎక్కువగా తీసుకోకుండా ఇదొక సాధారణ మ్యాచ్ లాగే చూడాలి' అని సమాధానం ఇచ్చాడు. ఆపై రావల్పిండి ఎక్స్ప్రెస్ మాట్లాడుతూ పాక్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని తమ జట్టుకు సూచించాడు. డాట్ బాల్స్ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నాడు. 5-6 ఓవర్ల వరకు బాల్ టూ బాల్ రన్ రేట్ కాపాడుకోవాలని చెప్పాడు. మంచి లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచితే.. విజయావకాశాలు ఉంటాయన్నాడు. భారీ లక్ష్యం ఉంటే బౌలింగ్లో విరుచుకుపడి, సులభంగా వికెట్లు తీయవచ్చని అక్తర్ చెప్పుకొచ్చాడు.

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల పూజలు:
సూపర్-12 మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. పంజాబ్లోని లూథియానాలో అభిమానులు హోమం నిర్వహించారు. క్రికెట్ టీమ్ ఫొటోకు హారతి ఇచ్చారు. ఇక కర్ణాటకలోని కలబురగిలో కూడా క్రికెట్ అభిమానులు భారత జట్టు గెలువాలంటూ పూజలు చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా క్రికెట్ అభిమానులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇక ఇప్పటివరకు ఐదుసార్లు టీ20 ప్రపంచకప్ టోర్నీలు జరుగగా ఒకసారి భారత్, ఒకసారి పాకిస్థాన్ జట్టు టైటిల్ గెలిచాయి. ఇక ఐదు టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ తలపడిన ప్రతి మ్యాచ్లో భారత జట్టే విజయం సాధించింది.


Click it and Unblock the Notifications

SL vs BAN: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. బినురా ఫెర్నాండో ఆయేగా! ఒక మార్పుతో బరిలోకి బంగ్లా!!