
షార్జా: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఈరోజు డబుల్ హెడర్ మ్యాచులు ఉన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచులో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా మహేశ్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో బినురా ఫెర్నాండో జట్టులోకి వచ్చాడు. మరోవైపు బంగ్లా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. టాస్కిన్ స్థానంలో నసుమ్ అహ్మద్ మ్యాచ్ ఆడుతున్నాడు. లంక, బంగ్లా జట్లు క్వాలిఫైయర్ మ్యాచులు ఆడి మరీ సూపర్ 12కు అర్హత సాధించాయి. రెండు జట్లు అద్భుత ఆటతో అలరించాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
శ్రీలంక ఆడిన చివరి గ్రూప్ గేమ్లో మహేశ్ తీక్షణ గాయపడ్డాడు. ఆట సందర్భంగా అతను ఎంఆర్ఐ స్కాన్ కోసం తీసుకువెళ్లారు. ఫీల్డ్ని వీడే ముందు తీక్షణ నెదర్లాండ్స్పై తన ఏకైక ఓవర్లో 3 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్ బినురా ఫెర్నాండో గాయం నుంచి కొలువడంతో అతడి స్థానంలో ఆడుతున్నాడు. నెదర్లాండ్స్, ఐర్లాండ్, నమీబియాలను ఓడించిన దాసున్ శనక నేతృత్వంలోని లంక టోర్నమెంట్లో అద్భుత విజయాలను ఆదుకున్నారు. బంగ్లాపై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు స్కాట్లాండ్పై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ ఒమన్, పాపువా న్యూ గినియాలను ఓడించిన బంగ్లా సూపర్ 12కి చేరింది. 2007 నుంచి బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక జట్లు టీ20 ప్రపంచకప్లలో ఎప్పుడూ తలపడలేదు. చాలా రోజుల తర్వాత రెండు తలపడడం ఇదే తొలిసారి. షార్జాలోని పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించలేం. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక్కడ సగటు స్కోర్ 140-150గా ఉంది. 170 పరుగులు చేస్తే.. లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకోవచ్చు.
తుది జట్లు:
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా (కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, బినురా ఫెర్నాండో, లహిరు కుమార.
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్, నూరుల్ హసన్ (కీపర్), మెహదీ హాసన్, మహ్మద్ సైఫుద్దీన్, నాసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్.