ఓ మహిళను లైంగికంగా వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బౌలర్ యష్ దయాళ్పై ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్లోని ఇందిరాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల సింగ్ అనే యువతి ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఫిర్యాదు చేసింది.
శారీరకంగా, మానసికంగా తనను వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత ఐదేళ్లుగా తనను అన్ని రకాలుగా వాడుకున్నాడని, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చే సరికి ముఖం చాటేసాడని తెలిపింది. ఇతర అమ్మాయిలతో కూడా యష్ దయాళ్ సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించింది. యష్ దయాళ్తో జరిపిన చాటింగ్ స్క్రీన్ షాట్స్, ఫోటోలు, వీడియో కాల్ రికార్డ్స్ వంటి పక్కా ఆధారాలు ఉన్నాయని కూడా వెల్లడించింది. రిలేషన్లో ఉన్న సమయంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా పేర్కొంది.

ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, దాంతోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. సదరు యువతి ఫిర్యాదుపై స్పందించిన సీఎంవో.. పూర్తి విచారణ జరిపి జూలై 21లోపు నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. సీఎంఓ ఆదేశాలతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద యష్ దయాళ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పెళ్లి, ఉద్యోగం లాంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు జరిమానా విధించే అవకాశం ఉంది. యష్ దయాళ్ తండ్రి ఈ ఆరోపణలను కొట్టిపారేసాడు. ఆ యువతి ఎవరో తమకు తెలియదని చెప్పాడు. యశ్ దయాళ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
ఐపీఎల్ 2025 సీజన్లో యష్ దయాళ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసాడు. ఆర్సీబీ విజేతగా నిలవడంలో అతని ప్రదర్శన కీలకంగా మారింది. పంజాబ్తో జరిగిన ఫైనల్లోనూ యష్ దయాళ్ ఒక వికెట్ తీసాడు. తాజా ఆరోపణలు, కేసు యష్ దయాళ్ కెరీర్పై ప్రభావం చూపనుంది.