టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మానసికంగా అలసిపోవడంతోనే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని ఓ దినపత్రికకు రాసిన కాలమ్లో పేర్కొన్నాడు. కోహ్లీ రిటైర్మెంట్ టీమిండియాకు కోలుకోని దెబ్బ అని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. కోహ్లీ గైర్హాజరే టీమిండియాకు నష్టం చేస్తుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ గైర్హాజరీ ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో టీమిండియా విజయవకాశాలను ప్రభావితం చేస్తుందన్నాడు.
'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం టీమిండియా విజయవకాశాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ లేకుండా ఆడటం టీమిండియా సవాలే. ఎందుకంటే కోహ్లీ మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్. గత కొన్నేళ్లుగా భారత్ తీరికలేని క్రికెట్ ఆడుతోంది. దాంతో విరాట్ కోహ్లీకి తగినంత విశ్రాంతి లేకుండా పోయింది. దాంతో అతను మానసికంగా అలసిపోయాడు. ఎంత ప్రతిభ, అనుభవం ఉన్నా.. మానసిక ప్రశాంతత లేకుంటే త్వరగా అలసిపోతారు. కోహ్లీ విషయంలో ఇదే జరిగింది. రోహిత్ గొప్ప బ్యాటర్ అయినప్పటికీ అతని టెస్ట్ రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. పైగా అతను కొన్నేళ్లుగా నిలకడలేమి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అందుకే రోహిత్ రిటైర్మెంట్ భారత జట్టుకు పెద్దగా నష్టం చేయకపోయినా..కోహ్లీ రిటైర్మెంట్ టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపనుంది.'అని బాయ్కాట్ తన కాలమ్లో రాసుకొచ్చాడు.

బాయ్కాట్ చెప్పినట్లుగా గత కొన్నేళ్లుగా టీమిండియా తీరిక లేని క్రికెట్ ఆడుతోంది. బ్రాడ్కాస్టర్స్, ప్రకటనదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో టీమిండియా ఎక్కువ మ్యాచ్లు ఆడుతోంది. ఏడాదిలో 9-10 నెలలు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుండగా.. మరో రెండు నెలలు ఐపీఎల్ ఆడుతున్నారు. కోహ్లీ.. కొన్ని సిరీస్లకు దూరంగా ఉన్నా.. 8 నెలల పాటు క్రికెట్ ఆడేవాడు. ముఖ్యంగా టెస్ట్ సిరీస్లు, ఐసీసీ టోర్నీలు, ఐపీఎల్ వంటి వాటిని ఖచ్చితంగా ఆడేవాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆట గాడి తప్పింది. వరుస వైఫల్యాలతో అతను తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చివరకు ఆట నుంచి తప్పుకున్నాడు.