
మెల్బోర్న్: భారత్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా వరుస పరాజయాలకు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్సే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ జెఫ్ లాసన్ అన్నాడు. స్పిన్ పిచ్లపై కెప్టెన్ కమిన్స్కు సరైన పరిజ్ఞానం లేకపోవడంతోనే సారథిగా అతను విఫలమయ్యాడని ఈ ఆసీస్ మాజీ ప్లేయర్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ టీమ్ స్పిన్ కోచ్గా సేవలందిస్తున్న డానియల్ వెటోరీ జట్టుకు తగినంత సమాచారం ఇవ్వడం లేదన్నాడు.
'కమిన్స్కు స్పిన్ పిచ్లపై సారథ్యం వహించిన అనుభవం పెద్దగా లేదు. షెఫీల్డ్ షీల్డ్లో అతను ఎక్కువగా ఆడలేదు. స్పిన్నింగ్ పిచ్లపై ఆడింది లేదు. మరి కమిన్స్ ఎక్కడ నేర్చుకుంటాడు? అతనికి సృజనాత్మక ఆలోచనలు ఎలా వస్తాయి? చాలా వరకు వీడియోలు చూసి నిర్ణయాలు తీసుకుంటున్నారు.'' అని జెఫ్ లాసన్ అన్నాడు.
భారత లోయర్ బ్యాటర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఆస్ట్రేలియా బౌలర్ల వద్ద ఎలాంటి వ్యూహాలు లేకపోయాయని తెలిపాడు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టుల సిరీస్లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింట్లోనూ విజయం సాధించిన భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ విజయాలతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రిటైన్ చేసుకుంది. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిన ఆసీస్.. రెండో టెస్ట్లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
రెండో టెస్ట్ల్లో మెరుగైన ప్రదర్శన చేసినా విజయాన్నందుకోలేకపోయింది. ముఖ్యంగా భారత స్పిన్నర్ల ఉచ్చులో పడి మూల్యం చెల్లించుకుంది. రెండో ఇన్నింగ్స్లో స్వీప్,రివర్స్ స్వీప్ షాట్లు ఆడబోయి ఆసీస్ ఆటగాళ్లు ఆరుగురు పెవిలియన్ చేరారు. దాంతో ఆసీస్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక వ్యక్తిగత కారణాలతో స్వదేశం పయనమైన కమిన్స్.. మళ్లీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో ఆసీస్ను వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నడిపించనున్నాడు.
మార్చి 1న ఇండోర్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. గాయాలతో తొలి రెండు టెస్ట్లకు దూరమైన కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ పూర్తిగా కోలుకున్నారు. ఇండోర్ టెస్ట్లో ఈ ఇద్దరు బరిలోకి దిగే అవకాశం ఉంది.