Gautham Gambhir, BAN vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్ అవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల్లో ఉన్నా.. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని, అనైతికమని దిగ్గజ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఔట్ విషయంలో షకీబ్ అల్ హసన్ అప్పీల్ను వెనక్కి తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే టైమ్ ఔటైన తొలి బ్యాటర్గా ఏంజెలో మాథ్యూస్ చరిత్రకెక్కాడు. షకీబ్ అల్ హసన్ వేసిన 25వ ఓవర్లో ఈ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ రెండో బంతికి సదీర సమరవిక్రమా క్యాచ్ ఔట్గా వెనుదిరగడంతో ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే గార్డ్ తీసుకునే సమయంలో అతని హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోయింది. దాంతో అతను బంతిని ఆడకుండా మరో హెల్మెట్ తీసుకురావాలని తమ డగౌట్ వైపు చూపించాడు. బంతి ఎదుర్కోకుండా హెల్మెట్ కోసం వేచి చూసాడు.
అప్పటికే నిర్ణీత సమయం సమయం ముగియడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ అప్పీల్ చేశాడు. అంపైర్ నిబంధనల ప్రకారం మాథ్యూస్ను ఔటిచ్చాడు. మాథ్యూస్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. షకీబ్ను కన్విన్స్ చేయాలని వారు అతనికి సూచించారు. షకీబ్ మాత్రం తన అప్పీల్ను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఈ ఘటనపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల్లో ఉన్నా క్రీడా స్పూర్తికి విరుద్దమని కామెంట్ చేస్తున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.. ఇది చాలా అన్యాయమని ట్వీట్ చేశాడు. 'ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఘటన ఏదైతో ఉందో అది చాలా అనైతికం, అన్యాయం'అని పేర్కొన్నాడు.
సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేయిల్ స్టెయిన్ సైతం షకీబ్ అల్ హసన్ తీరును తప్పుబట్టాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తనదైన శైలిలో స్పందించాడు. హెల్మెట్ సమస్యతో టైమ్ ఔటవ్వడం.. కొత్తగా వింటున్నానని వాన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.