
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మొదలైతే దేశ ప్రజల మానసికస్థితి కాస్త మారుతుందని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. కరోనా విలయతాండవంతో దేశంలో ఒక విధమైన భయానక, ఆందోళనకర వాతావరణం నెలకొందని... ఇలాంటి సమయంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరిగితే దేశ ప్రజలకు క్రికెట్ ద్వారా సాంత్వన లభిస్తుందన్నాడు. వారి మూడ్ మొత్తం మారుతుందని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ ఈ కోల్కతా నైట్రైడర్స్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
'13వ సీజన్ ఎక్కడ జరుగుతుందనేది అప్రస్తుతం. ముందు జరగడమే ముఖ్యం. మన ప్రజల దృష్టి ఆటలపై పడితే ఇప్పుడున్న దుస్థితి మారుతుంది. క్రికెట్ నుంచి లభించే ఊరట యావత్ భారతావని మూడ్నే మార్చేస్తుంది. ఏ ఫ్రాంచైజీ గెలుస్తారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరెక్కువ వికెట్లు తీస్తున్నారు అనే పట్టింపుల కన్నా... దేశ మానసిక స్థితి మారుతుంది.
ఇప్పుడు నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఈ లీగ్ గతంలో జరిగిన లీగ్లకంటే గొప్పదవుతుంది. దేశానికి సాంత్వన చేకూరుస్తుంది' అని అన్నాడు. యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరుగుతుంది.