ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ కాస్త పోటీ ఇచ్చినా ఫలితం మాత్రం మారలేదు. అయితే ఈ మ్యాచ్లో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ సమయం నుంచే వారికి దూరంగా వ్యవహరించారు. అయితే భారత బ్యాటింగ్ సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వింపులకు దిగగా.. భారత బ్యాటర్లు ఆటతోనే బదులిచ్చారు.
ముఖ్యంగా హరీస్ రౌఫ్ కవ్వింపులకు అభిషేక్ శర్మ తనదైన శైలిలో బదులిచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు జోక్యం చేసుకొని గొడవను ఆపారు. ఈ మ్యాచ్లో చిత్తుగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. ఓటమి ఖాయమని తెలిసినా.. వికెట్ తీసినప్పుడు అతిగా సంబరాలు చేసుకున్నారు. సంజూ శాంసన్ వికెట్ తీసిన అనంతరం హరీస్ రౌఫ్ రఫేల్ను కూల్చినట్లు సైగలు చేశాడు.

తిలక్ వర్మ వరుసగా 6, 4 బాది భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. విజయానంతరం భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లారు. అయితే భారత ఆటగాళ్లందర్నీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి మైదానంలోకి తీసుకొచ్చాడు. కనీసం అంపైర్లు, మ్యాచ్ అధికారులకైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆటగాళ్లకు సూచించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
లీగ్ దశలో పాకిస్థాన్ ఓడించిన అనంతరం కూడా భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని తమ సారథికి చెప్పిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని డిమాండ్ చేసింది. అతన్ని తప్పించకుంటే టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఐసీసీ మాత్రం ఆండీ పైక్రాఫ్ట్ తప్పులేదని పేర్కొంటూ.. భారత్, పాక్ మ్యాచ్కు మళ్లీ అతన్నే మ్యాచ్ రిఫరీగా నియమించింది.
భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ ఫైనల్ చేరాలంటే తదుపరి మ్యాచ్ల్లో శ్రీలంక, బంగ్లాదేశ్ను ఓడించడంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధించాలి. లేకుంటే పాక్ మరోసారి ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పడుతోంది. అజేయంగా దూసుకెళ్తున్న భారత్ కూడా ఫైనల్ బెర్త్ ఖరారు కావాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించాలి. ఒక మ్యాచ్లో ఓడినా రన్రేట్ తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ భారత్, పాక్ ఫైనల్ చేరితే ఆదివారం(సెప్టెంబర్ 28) మరోసారి తలపడనున్నాయి.