టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆటలో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక క్యాచ్ను చేజార్చడంతో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన చేతి వేల్లతో కళ్లను మూసుకుంటూ తన బాధను తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
నాలుగో రోజు ఆట తొలి సెషన్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 35వ ఓవర్లో సిరాజ్ తప్పిదం కారణంగా హ్యారీ బ్రూక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ఈ బంతిని అద్భుతంగా అందుకున్నప్పటికీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అంతేకాకుండా బౌండరీ లైన్కు దగ్గరగా ఉన్నానే విషయం మరిచిపోయాడు.

బంతిని అందుకొని బౌండరీ లైన్ తొక్కాడు. బౌండరీ లైన్ను తొక్కడం చూసి షాక్కు గురైన సిరాజ్.. తలను పట్టుకున్నాడు. మరోవైపు సిరాజ్ క్యాచ్ పట్టడంతో సంబరాలు చేసుకున్న ప్రసిధ్.. చివరకు అసలు విషయం తెలుసుకొని తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ అవకాశంతో హ్యారీ బ్రూక్ చెలరేగుతున్నాడు. దూకుడుగా ఆడుతూ.. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించే గంభీర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.
మరోవైపు జో రూట్ సైతం 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అద్భుతంగా ఆడుతున్న ఈ జోడీ ఇంగ్లండ్ను విజయం దిశగా నడిపిస్తోంది. సిరాజ్ చేసిన తప్పిదం ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు ఊపిరి అందించింది. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 122 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. 23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 396 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్(118) సెంచరీతో సత్తా చాటగా.. ఆకాష్ దీప్(66), రవీంద్ర జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు.