టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తన మార్క్ చూపిస్తున్నాడు. జట్టు ఎంపిక దగ్గర్నుంచి.. జట్టు వ్యూహాల వరకు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెబుతూ.. వినూత్న ఆలోచనలతో దూసుకుపోతున్నాడు. కోచ్గా అసాధారణమైన నిర్ణయాలతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు. దుబాయ్ పిచ్కు అనుగుణంగా ఐదుగురు స్పిన్నర్లను ఏర్పాటు చేయడంతో పాటు తుది జట్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించాడు. అంతేకాకుండా బ్యాటింగ్ డెప్త్ ఉండేలా.. కేఎల్ రాహుల్ను ఆరో స్థానంలో ఆడించి ఆశించిన ఫలితాలను రాబట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగియడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు రెండున్నర నెలలపాటు విశ్రాంతి లభించనుంది. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్ 2025 సీజన్ ఆడనున్నారు. అయితే ఈ ఖాళీ సమయాన్ని గంభీర్ విశ్రాంతికి వాడుకోకుండా.. తదుపరి సిరీస్ల కోసం వ్యూహాలను సిద్ధం చేసుకొనేందుకు వెళ్తున్నారట. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గౌతమ్ గంభీర్ భారత్ ఏ జట్టుతో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ అనంతరం భారత జట్టు ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అంతకుముందు భారత్-ఏ జట్టు ఇంగ్లండ్లో పర్యటించే అవకాశం ఉంది. భారత్-ఏ జట్టుతో ఈ పర్యటనకు గంభీర్ వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

'ఆస్ట్రేలియా పర్యటన అనంతరం బీసీసీఐ పెద్దలతో గంభీర్ సుదీర్ఘంగా చర్చించాడు. భారత్ ఏ జట్టుతో ప్రయాణిస్తానని చెప్పాడు. తద్వారా రిజర్వ్ బెంచ్ను బలోపేతం చేసుకునే అవకాశం దక్కుతుందని గంభీర్ అభిప్రాయం. అందుకే భారత్-ఏ జట్టుతో వెళ్లాలని గంభీర్ భావిస్తున్నాడు.'అని బోర్డుకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.
గతంలో రాహుల్ ద్రవిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్గా భారత్-ఏ జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. ఆ తర్వాతనే హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ద్రవిడ్ తర్వాత ఎన్సీఏ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. ద్రవిడ్ అనంతరం లక్ష్మణ్ బాధ్యతలు చేపడుతారని అంతా అనుకున్నారు. కానీ గంభీర్ హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. బాధ్యతలు తీసుకున్న 9 నెలల వ్యవధిలోనే ఐసీసీ టైటిల్ గెలిచాడు.