
న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022లో టీమిండియా కీలకపోరుకు సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో శ్రీలంకతో చావో రేవో మ్యాచ్ ఆడనుంది. టైటిల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో తప్పనిసరి గెలవాల్సిందే. సూపర్ 4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్పై ఓటమితో టీమిండియాకు సంకట పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జట్టు బౌలింగ్ విభాగం మార్చాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన గంభీర్.. యుజ్వేంద్ర చాహల్పై వేటు వేయాలన్నాడు.
అతని స్థానంలో అవేశ్ ఖాన్ను తీసుకోవాలని గంభీర్ సూచించాడు. ఇక యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్కి మరో అవకాశం ఇవ్వాలని తెలిపాడు. ' యుజ్వేంద్ర చాహల్ ఆశించిన మేర ఈ టోర్నీలో రాణించడం లేదు. అతని స్థానంలో అవేశ్కు చోటు కల్పించాలి. ఇక రవి బిష్ణోయ్ని కచ్చితంగా కొనసాగించాలి' అని గంభీర్ సలహా ఇచ్చాడు. అనారోగ్యం కారణంగా పాక్తో మ్యాచ్కు దూరమైన అవేశ్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉన్నాడు.
మరోవైపు టీమిండియాకు బౌలింగ్ బలహీనత ప్రతికూలంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయంతో దూరమవడం, మధ్యలో జడేజా గాయంతో నిష్క్రమించడంతో కావాల్సినన్ని బౌలింగ్ వనరులు జట్టుకు లేకుండా పోయాయి. పాక్తో గత మ్యాచ్లో ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం కనిపించలేదు. ముఖ్యంగా సీనియర్ బౌలర్ల వైఫల్యం జట్టు కొంపముంచుతోంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సీనియర్ పేసర్ భువనేశ్వ కుమార్తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ధారళంగా పరుగులిచ్చారు.
ముఖ్యంగా చాహల్ పదే పదే ఫుల్టాస్లు వేస్తూ విసుగుతెప్పించాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకపై సరైన ప్రణాళికలతో రోహిత్ సేన బరిలోకి దిగి.. విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తద్వారా బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ బలం పెరగనుంది. మరీ రోహిత్ శర్మ ఏం చేస్తాడో చూడాలి.