
న్యూఢిల్లీ: దేశంలో చోటుచేసుకునే ప్రతీ ఘటనపై ఘాటుగా స్పందించే టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ లాక్డైన్ నేపథ్యంలో ప్రజల నిర్లక్ష్యంపై కూడా పెదవి విప్పాడు. కరోనా మార్గదర్శకాలను ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జైల్లో వేయాలని పోలీసులకు సూచించాడు.
భారత్లో చాపకింద నీరులా ప్రవేశించిన కరోనా వైరస్ మూడో దశకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆదివారం జనతా కర్ప్యూ నిర్వహించిన భారత ప్రభుత్వం సమస్యాత్మక నగరాల్లో ఈ నెల 31వరకు లాక్డౌన్ విధించింది. అయితే ఆదివారం బుద్దిగా ప్రభుత్వ సూచనలు పాటించిన ప్రజలు సోమవారం మాత్రం రెక్కలొచ్చిన పక్షుల్లా నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో గంభీర్ ట్విటర్ వేదికగా హిందీలో పలు సూచనలు చేశాడు.
'మీ నిర్లక్ష్యం వల్ల మీ ఒక్కరే కాదు.. మీ కుటుంబం మొత్తాన్ని జైలు లేదా క్వారంటైన్కు తీసుకువెళ్తారు. దయచేసి సమాజానికి ముప్తుగా ఉండకండి. ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు చేస్తున్న ఈ యుద్దం జీవితం కోసం. దీనికన్నా ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కువకాదు. అత్యవసర సేవలు అందించే వారు మినహా మిగతావారు లాక్డౌన్ను అనుసరించండి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జైహింద్'అని ట్వీట్ చేశాడు. ఇక సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రజల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
'లాకౌడౌన్లను చాలా మంది సీరియస్గా తీసుకోవడం లేదు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమ, నిబంధనలు పాటిస్తూ చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా'అని పేర్కొన్నారు.