టీమిండియా సీనియర్ ఆటగాళ్లపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వేడెక్కినట్లు తెలుస్తోంది. వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న గంభీర్.. ఆటగాళ్లపై మండిపడినట్లు సమాచారం.
డ్రా చేసుకునే అవకాశం ఉన్నా..ఆటగాళ్ల నిర్లక్ష్యపు షాట్లతో ఔటవ్వడంపై ఫైర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక చేసింది చాలని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోచ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆటగాళ్లు వారి మార్గాల్లో ఆడేందుకు గంభీర్ 6 నెలలు స్వేచ్ఛ ఇచ్చాడనీ , కానీ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి నుంచి జట్టు వ్యూహాలకు అనుగుణంగా ఆడనివారిపై వేటువేసే దిశగా చర్యలు ఉంటాయని అతను సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం గంభీర్ వ్యూహాలకు.. మైదానంలోని ఆటగాళ్ల ఆట మధ్య పొంతన ఉండటం లేదనే దానిపై తీవ్ర చర్చ సాగుతోంది.

ముఖ్యంగా డ్రా కోసం ఆడాలని చెప్పి పంపించిన రిషభ్ పంత్ సహనం కోల్పోయి పేలవ షాట్తో వికెట్ పారేసుకోవడంపై గంభీర్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ తన బలహీనతను అధిగమించకపోవడం.. రోహిత్ ఏ స్థానంలో వచ్చినా విఫలమవుతుండటంతో గంభీర్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు గంభీర్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను జట్టులోకి తీసుకోవాలని గంభీర్ సూచిస్తే.. సెలెక్టర్లు నిరాకరించినట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్ట్ అనంతరమే పుజారాను జట్టులోకి తీసుకోవాలని సిఫార్సు చేయగా.. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ నో చెప్పిందట.