సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. సరైన కాంబినేషన్తో బరిలోకి దిగకపోవడం.. పిచ్ కండిషన్స్ తగ్గట్లు జట్టును సిద్దం చేయకపోవడం.. స్పెషలిస్ట్ బ్యాటర్లకు బదులు ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వడం, ఏకపక్షంగా టర్నింగ్ ట్రాక్ను సిద్దం చేయడం వంటి తప్పిదాలు టీమిండియా ఓటమికి కారణమయ్యాయనే విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా మూడో స్థానంలో సాయి సుదర్శన్కు బదులు స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించడం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది. దాంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. ఈ ఓటమి నుంచి గంభీర్ ఏ మాత్రం పాఠాలు నేర్చుకోలేదు.

గౌహతి వేదికగా శనివారం ప్రారంభమైన రెండో మ్యాచ్లోనూ గంభీర్ అవే తప్పిదాలను పునరావృతం చేశాడు. పిచ్ కండిషన్స్ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన గంభీర్.. మరోసారి ఆల్రౌండర్లకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగింది. శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ స్థానాల్లో సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చారు.
ఏ మాత్రం ఫామ్లో లేని నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేసిన తర్వాత అతను ఒక్క మ్యాచ్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. బౌలింగ్లోనూ ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలోనే 8వ స్థానంలో వచ్చి 20 పరుగులు చేసేందుకు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటారా? అనే విమర్శలు వస్తున్నాయి.
తాజా మ్యాచ్లో పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. టీమిండియా ఎక్స్ట్రా స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగితే అడ్వాంటేజ్గా ఉండేది. కానీ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొని మూల్యం చెల్లించుకుంది. అతనితో నాలుగు ఓవర్లు మాత్రమే వేయించిన భారత్.. మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. ధారళంగా పరుగులివ్వడంతో పక్కనపెట్టింది. ఓవైపు బుమ్రా, సిరాజ్ కట్టడిగా బౌలింగ్ చేసి ఒత్తిడిని పెంచితే నితీష్ పరుగులు వచ్చి ఆ ప్రెజర్ను రిలీజ్ చేశాడు. దాంతో పంత్ మళ్లీ అతనికి బంతిని ఇచ్చే సాహసం చేయలేదు.
ఈ క్రమంలోనే నితీష్ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. నితీష్ బదులు మూడో పేసర్ను ఆడించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆకాశ్ దీప్, మహమ్మద్ షమీ వంటి పేసర్ అందుబాటులో ఉంటే భారత్కు కలిసొచ్చేదనే మాటలు వినిపిస్తున్నాయి. బౌలింగ్లో విఫలమైన నితీష్ కుమార్ రెడ్డి.. బ్యాటింగ్లోనూ తేలిపోతే గంభీర్పై మరిన్ని విమర్శలు రానున్నాయి.