మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు సన్నాహకాలు ప్రారంభించింది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో మంగళవారం తొలి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విశ్రాంతిలో ఉన్న ఆటగాళ్లంతా ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
నయా కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లతో టీ20 క్రికెట్లో టీమిండియా కొత్త శకం ప్రారంభం కానుంది. శ్రీలంక పర్యటనలో ముందుగా టీ20 సిరీస్ జరగనుండగా తొలి మ్యాచ్ జులై 27న జరగనుంది. సీనియర్ ఆటగాళ్లు రీఎంట్రీ ఇవ్వడం.. కోచ్గా గంభీర్ బాధ్యతలు స్వీకరిస్తుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తినెలకొంది.

మొదటి ప్రాక్టీస్ సెషన్లోనే గంభీర్.. తన మార్క్ కోచింగ్ కనబర్చాడు. ప్రతీ ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారి ప్రాక్టీస్ను నిశితంగా పరిశీలించాడు. వారి లోపాలను సరిచేసే ప్రయత్నం చేశాడు. టీ20 ఫార్మాట్లో ప్రతీ బ్యాటర్ దూకుడుగానే ఆడాలని, ఎవరూ కూడా ట్యాక్లింగ్ చేయవద్దని ఆటగాళ్లను గంభీర్ ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
సంజూకు గంభీర్ స్పెషల్ క్లాస్..
అయితే దూకుడుగా ఆడే క్రమంలో పిచ్చి షాట్స్ ఆడవద్దని కూడా గంభీర్.. ఆటగాళ్లకు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంజూ శాంసన్ బ్యాటింగ్ టెక్నిక్ సంబంధించి గంభీర్ అతనితో ప్రత్యేకంగా మాట్లాడాడు. తొలి ప్రాక్టీస్ సెషన్కు సంబంధించి బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది.
సంజూ శాంసన్పై గంభీర్కు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అతనే సంజూ శాంసన్ను ఐపీఎల్లోకి తీసుకొచ్చాడు. 2012లో కేకేఆర్ జట్టులోకి సంజూ శాంసన్ను తీసుకున్నాడు. ఆ సీజన్లో సంజూ ఒక్క మ్యాచ్ ఆడకపోయినా.. కేకేఆర్ విజేతగా నిలిచింది. అప్పటి టీమ్లో సంజూ శాంసనే అత్యంత పిన్నవయస్కుడు.
సంజూను ప్రోత్సహించిందే గంభీర్..
ఒక్క మ్యాచ్లో అవకాశం ఇవ్వకపోయినా.. సంజూ శాంసన్ నైపుణ్యాలు పెంపొందించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడని, అప్పటి కేకేఆర్ ఆటగాళ్లు తరుచూ అంటుంటారు. సంజూ శాంసన్ ప్రతిభ కలిగిన ఆటగాడే అయినా.. అతను నిలకడగా రాణించకపోవడం లోపంగా మారింది. ముఖ్యంగా అతనికి ఓపిక తక్కువ. ఎక్కువ సార్లు అతను చెత్త షాట్లకే వెనుదిరిగాడు.
తమిళనాడు మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తరుచూ సంజూ శాంసన్ గురించి ఇదే చెబుతారు. సంజూ శాంసన్ బ్యాటింగ్ టెక్నిక్పై ఫోకస్ పెట్టిన గంభీర్.. ప్రాక్టీస్ సెషన్లో అతనికి స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు.
సంజూ శాంసన్ చేస్తున్న తప్పిదాలను వివరించాడు. అన్ని బంతులను కొట్టాల్సిన అవసరం లేదని, కఠినమైన బంతులను డిఫెండ్ చేయడం కూడా ముఖ్యమేనని బ్యాట్ పట్టి నేర్పించాడు. ఇలా కఠినమైన బంతులను డిఫెండ్ చేయడం వల్ల క్రీజులో ఎక్కువసేపు ఉండగలవని, పరుగులు కూడా చేయగలవని గంభీర్ వివరించాడు. ప్రధాన వికెట్ కీపర్గా రిషభ్ పంత్ తుది జట్టులో చోటు దక్కినా.. మిడిలార్డర్లో సంజూ శాంసన్ ఆడే అవకాశం ఉంది.