శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో మంగళవారం ఈ ప్రాక్టీస్ సెషన్ జరిగింది. ఈ పర్యటనతో గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోచ్గా గంభీర్ ఏం చేయబోతున్నాడు? ఆటగాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నాడు? అనే ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా.. ఆతిథ్య శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడనుంది. ముందుగా టీ20 సిరీస్ జరగనుండగా జులై 27న పల్లెకెలె వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత టీ20 ఆటగాళ్లంతా నెట్స్లో చెమటోడ్చారు. అయితే భారత బ్యాటర్లకు గౌతమ్ గంభీర్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్లో ప్రతీ బ్యాటర్ దూకుడుగానే ఆడాలని, ఎవరు కూడా యాంకర్ రోల్ పోషించవద్దని గంభీర్ సూచించినట్లు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిథులు పేర్కొన్నారు.

బ్యాటర్లంతా ట్యాక్లింగ్ చేయడమే మర్చిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. టీ20ల్లో మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ అనుసరించిన దూకుడు మంత్రాన్నే కొనసాగించాలని గంభీర్.. ఆటగాళ్లకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. గంభీర్ తాజా నిర్ణయం బిగ్ హిట్టర్స్ అయిన యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్లను సంతోషపరుస్తుండగా.. నిదానంగా ఆడే వైస్ కెప్టెన్ను శుభ్మన్ గిల్ను కలవరపరుస్తోంది.
శుభ్మన్ గిల్ కాస్త నిదానంగా ఆడుతాడు. ఎలాంటి ర్యాంప్ షాట్స్ కాకుండా టెస్ట్ బుక్ షాట్స్ ఆడుతూ ఉంటాడు. దూకుడుగా ఆడే సామర్థ్యం ఉన్నా.. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకుంటాడు. అలాంటి శుభ్మన్ గిల్ గంభీర్ ఆదేశాలతో తన సహాజశైలికి విరుద్దంగా ఆడబోయి ఇబ్బందులు ఎదుర్కొంటాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాక్టీస్ సెషన్లో గంభీర్.. ప్రతీ ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన వీడియోలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆటగాళ్లను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడటం... బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో కనిపించింది.