న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్లపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ పాన్ మసాల యాడ్లో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు నటించడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. అసలు ఈ ఇద్దరూ రోల్ మోడల్సేనా? అని ప్రశ్నించాడు. వీరు చేసిన పని చాలా అసహ్యంగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
దేశంలో కోట్ల మంది పిల్లలు చూస్తారనే ఇంగిత జ్ఞానం లేకుండా డబ్బుల కోసం ఇంతకు దిగజారాలా? అని గంభీర్ ప్రశ్నించాడు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా 'కమలా పసంద్' పాన్ మసాలా సంస్థ రూపొందించిన యాడ్లో సెహ్వాగ్, గవాస్కర్లతో పాటు కపిల్ దేవ్, క్రిస్ గేల్ నటించారు.

అయితే గుట్కా, లిక్కర్ ప్రకటనలకు భారత్లో అనుమతి లేకపోవడంతో ఆయా కంపెనీలు.. సోడా, ఇలాచీ ఫ్లేవర్స్ పేరిట తమ బ్రాండ్స్ను ప్రమోట్ చేసుకుంటాయి. కమలా పసంద్ కంపెనీ కూడా సిల్వర్ కోటెడ్ ఇలాచీ ఫ్లేవర్ యాడ్ను దిగ్గజ ఆటగాళ్లతో రూపొందించింది. అయితే ఈ యాడ్పై ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగానే సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
తాజాగా న్యూస్ 18 చానెల్తో మాట్లాడిన గంభీర్.. ఈ యాడ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇది నిజంగా అసహ్యం. దిగ్గజ ఆటగాళ్లు చేసిన ఈ పనితో తీవ్ర నిరాశకు గురయ్యాను. వీళ్లేనా మన రోల్ మోడల్స్ అనిపించింది. అందుకే రోల్ మోడల్ను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా.
మన పేరును కాకుండా మనం చేసే పనులతో జనాలు మనల్ని గౌరవిస్తారు.
దేశంలో కోట్లాది మంది పిల్లలు ఈ యాడ్స్ చూస్తారు. డబ్బు కోసం ఇలాంటి పాన్ మసాలా యాడ్స్లో నటించడం అవసరమా? ఇంత నీచానికి దిగుజారుతారా? 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు రూ.3 కోట్లు ఇచ్చారు. కానీ నేను దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే మనది కానీ సొమ్ము తీసుకోవడం మంచిది కాదని నేను నమ్ముతాను.
సారథ్య బాధ్యతలు వదులుకున్న తర్వాత ఆ డబ్బును తీసుకోవడం పద్దతి కాదనిపించింది. పాన్ మసాల ప్రకటనలో నటించాలని సచిన్ టెండూల్కర్కు రూ.20-30 కోట్లు ఆఫర్ చేశారు. కానీ అలాంటి వాటిల్లో భాగస్వామి కానని ఆయన తన తండ్రికి మాటిచ్చారు. అందుకే నేను సచిన్ను రోల్ మోడల్గా ఎంచుకున్నాను. అలాంటి పెద్ద ఆఫర్ను వదులుకునేందుకు చాలా ధైర్యం కావాలి' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.