న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు స్నేహంగా ఉండడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. స్నేహం కారణంగా గెలవాలనే కసి తగ్గుతుందని, ఫ్రెండ్షిప్ను గ్రౌండ్ బయటే వదిలేయాలని సూచించాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
మిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ బ్యాటింగ్ సాధ్యమవ్వలేదు. దాంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు. ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు స్నేహంగా ఉన్నారు. నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు.

గతంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ జరిగిన ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వైరం ఉండేది. మ్యాచ్ ఓ యుద్దాన్ని తలిపించేది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగి వివాదాలకు దారితీసేది. విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించేవి. కానీ ఈసారి అలాంటి సన్నివేశాలు ఏవి కనిపించలేదు.
ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు. గత కొంత కాలంగా భారత్-పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య మంచి స్నేహం కనిపిస్తోంది. ఇరు జట్లలో ఎవరూ రాణించినా ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో స్నేహాన్ని మైదానం బయటే వదిలేయాలన్నాడు. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రత్యర్థిని శత్రువులా చూడాలని సూచించాడు.
ఒకప్పుడు భారత్-పాక్ మ్యాచ్ చూస్తుంటే రోమాలు నిక్కబొడిచేవని, ఇప్పుడు ఆ ఫీలింగ్ రావడం లేదన్నాడు. 'భారత్ తరుపున ఆడుతున్నప్పుడు స్నేహాన్ని మైదానం బయటే వదిలేయాలి. మ్యాచ్లో ప్రత్యర్థి జట్టును శత్రువుగానే చూడాలి. అప్పుడే ఎలాగైనా గెలవాలనే కసి పెరుగుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో ఇరు జట్ల ప్లేయర్లలో నాకు దూకుడు కనిపించలేదు. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచులు.. గెలవాలనే కసిని తగ్గిస్తాయి. ఏదో మొక్కుబడిగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఉంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత స్నేహంగా మాట్లాడినా.. ఫొటోలకు ఫోజులిచ్చినా పర్వలేదు. కానీ ఆట మొదలయ్యాక మాత్రం గెలవాలనే కసి మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు దేశంలోని 130 కోట్ల మంది తరుపున ఆడుతున్నారు. మా హయాంలో మేం అదే ఆలోచనతో ఉండేవాళ్లం. మ్యాచ్ జరుగుతున్నంత సేపు గెలవాలనే కసి ఉన్నప్పుడు ప్రత్యర్థి ప్లేయర్ ఎప్పుడూ శత్రువుగానే కనిపిస్తాడు.
ఇంతకుముందు భారత్- పాకిస్థాన్ మ్యాచ్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేవి. కానీ ఆటగాళ్ల స్నేహం కారణంగా ఇప్పుడు ఆ ఫీలింగ్ రావడం లేదు. 'అని గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.