న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో రెండో టీ20లో భారత్ విజయం సాధించింది కాబట్టే కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన ఘోర తప్పిదం పెద్దదిగా కనిపించడం లేదని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా నిర్ణయాలు తనకు ఆశ్చర్యం కలిగించాయన్నాడు. స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై యుజ్వేంద్ర చాహల్తో పూర్తి కోటా ఓవర్లను వేయించలేదన్నాడు. కుల్దీప్ యాదవ్, దీపక్ హుడాలతో ఫుల్ కోటా వేయించిన పాండ్యా.. చాహల్కు మాత్రం రెండు ఓవర్లే ఇచ్చాడు.
కివీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ షోలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గంభీర్ మాట్లాడుతూ.. 'ఇది షాకింగ్ డిసీషన్. అసలు ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. స్పిన్కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై చాహల్కు ఫుల్ కోటా బౌలింగ్ ఇవ్వకపోవడం ఏంటి? టీ20ల్లో అతను మీ జట్టుకు నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు.
అటువంటి బౌలర్ను కేవలం రెండు ఓవర్లు వేయించి తర్వాత పక్కనబెట్టడం ఆశ్చర్యకర నిర్ణయం. యువ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, శివం మావిలకు అవకాశమివ్వడంలో తప్పులేదు. అలా అయితే చాహల్ తో మొదటి, చివరి ఓవర్లు వేయిస్తే సరిపోయేది. లక్నో పిచ్పై అతడు కివీస్ ను మరింత దెబ్బకొట్టేవాడు.
స్పిన్కు అనుకూలించిన ఈ పిచ్ పై చాహల్కు గనక ఫుల్ కోటా ఇచ్చుంటే కివీస్.. 80-85 పరుగులకే పరిమితమై ఉండేది. అలాగాక హుడాతో నాలుగు ఓవర్లు వేయించాడు.'అని చెప్పాడు. హార్ధిక్ పాండ్యా నాలుగు ఓవర్లు విసిరి అత్యధిక పరుగులు సమర్పించుకోవడానికి బదులుగా తన ఓవర్లను అతడు చాహల్కు ఇస్తే బాగుండేదని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.