న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఘాటు విమర్శలు చేశాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో బాబర్ ఆజామ్ హాఫ్ సెంచరీ కోసం కక్కుర్తి పడ్డాడని మండిపడ్డాడు. వ్యక్తిగత రికార్డు కోసం అతను నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం పాకిస్థాన్ ఓటమిని శాసించిందని అభిప్రాయపడ్డాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్తో గత శనివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్పై టీమిండియా ఆధిపత్యం 87-0గా మారింది.

తాజాగా అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గంభీర్.. పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని విశ్లేషించాడు. బాబర్ ఆజామ్ స్వార్థపూరిత బ్యాటింగే ఆ జట్టు విజయవకాశాలను దెబ్బ తీసిందని తెలిపాడు.
'బాబర్ ఆజామ్ పిరికివాడు. భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో ఇద్దరు బ్యాటర్లు నెమ్మదిగా ఆడవద్దు. ఒకరు ధాటిగా ఆడితే మరొకరు యాంకర్ రోల్ పోషించాలి. కానీ బాబర్, రిజ్వాన్ చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు. రిజ్వాన్ కంటే ముందు బ్యాటింగ్కు వచ్చిన బాబర్ ఆజామ్ అటాకింగ్ గేమ్ ఆడాల్సింది.
కానీ అతను హాఫ్ సెంచరీ చేసుకోవాలనే ఆలోచనతో నెమ్మదిగా ఆడాడు. దాంతో పాకిస్థాన్కు ఘోర పరాజయం తప్పలేదు. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి.
వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన బాబర్ ఆజామ్ చెత్త షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. అప్పటికే 60 బంతులు ఆడి 50 పరుగులు చేసి కూడా అలాంటి షాట్ ఆడటం దారుణం. అతను ఔటైన బంతి పెద్దగా బౌన్స్ కూడా అవ్వలేదు. లెంగ్త్ బాల్ కూడా కాదు. పంచ్ షాట్ ఆడకుండా లెట్ కట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజామ్ చాలా పరుగులు చేశాడు. ఎన్నో ఘనతలను అందుకున్నాడు. కానీ మునపటి పాకిస్థాన్ బ్యాటర్లలా మాత్రం నిర్భయంగా ఆడటం లేదు. గత పాకిస్థాన్ జట్టులో షాహిద్ అఫ్రిది, ఇమ్రాన్ నజీర్, తౌఫిక్ ఊమర్ దూకుడుగా బ్యాటింగ్ చేసవారు. ప్రస్తుత జట్టు టాప్ ఆర్డర్లో ప్రత్యర్థిపై విరుచుకుపడే బ్యాటర్ ఒక్కరు కూడా లేరు.
టాప్ క్వాలిటీ బౌలింగ్ అటాక్ను ఎదుర్కొంటున్నప్పుడు ఎలాంటి భయం లేకుండా స్వేచ్చగా ఆడాలని డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకోవాలి. 150 పరుగులకే ఔటైనా.. ఏ మాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేయాలి. టాప్-3 త్వరగా ఔటైనా.. నెంబర్ 4-5 బ్యాటర్లు జట్టును ఆదుకుంటారు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.