Gautam Gambhir: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమిని సంబరాలు చేసుకోవడంపై మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, వసీమ్ అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్దతని ప్రశ్నించారు. అభిమాన జట్టు గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం ఓ పద్దతి కానీ.. తమకు నచ్చని జట్టు ఓటమిని సెలెబ్రేట్ చేసుకోవడం సంస్కారం కాదని మండిపడ్డారు.
వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శనతో వరుసగా 10 విజయాలు సాధించి ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన రోహిత్ సేన.. ఆసీస్తో జరిగిన కీలక ఫైనల్లో మాత్రం ఓటమిపాలైంది. ఈ ఓటమిని ఆసీస్ మీడియాతో పాటు పాకిస్థాన్ దేశంలోని కొందరు అభిమానులు, ప్రముఖులు సంబరాలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

లీగ్ దశలో పాకిస్థాన్ ఇంటిదారి పట్టినప్పుడు భారత్లోని అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇలా ఒక జట్టు ఓటమిని సెలెబ్రేట్ చేసుకోవడాన్ని ఇరు దేశాల దిగ్గజ ఆటగాళ్లు తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు పోట్లాడుకోవడం సరైన పద్దతి కాదని సూచించారు. తాజాగా ఓ చానెల్ చర్చలో పాల్గొన్న గంభీర్, వసీం అక్రమ్.. ఇది ఏమాత్రం క్రీడా స్పూర్తి కాదని తెలిపారు.
ముందుగా వసీమ్ అక్రమ్ మాట్లాడుతూ.. ప్రముఖులు కూడా అవాకులు చెవాకులు పేల్చడం సరికాదన్నాడు. 'ఇరు దేశాల ప్రముఖులు అవాకులు, చెవాకులు పేల్చారు. వాటి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఎవరి దేశంపై వారికి భక్తి ఉండటం సహజమే. ప్రతీ జట్టు కొన్ని సమయాల్లో ఇబ్బందులు పడుతోంది. అలాంటప్పుడు ఆ జట్టును అవమానించేలా ప్రవర్తించడం ఏమాత్రం సరి కాదు. ఆటను ఆటలానే చూడాలి.'అని వసీమ్ అక్రమ్ తెలిపాడు.

అక్రమ్ వ్యాఖ్యలతో గౌతమ్ గంభీర్ ఏకీభవించాడు. 'మీ అభిమాన జట్టు విజయం సాధించినప్పుడు చేసే సంబరాలపై ఫోకస్ పెట్టాలి. అంతేకానీ, ఇతర జట్లు ఓడిపోయినప్పుడు దానిని సెలెబ్రేట్ చేసుకోవడం సరికాదు. పక్క జట్టు ఓటమిని ఆస్వాదించడం సంస్కారం కాదు. భారత్ ఫైనల్లో ఓడిన తర్వాత పాకిస్థాన్లో కొందరు సంతోషించారు.
అలానే పాకిస్థాన్ లీగ్లోనే ఇంటిముఖం పట్టినప్పుడు భారత్లోనూ పలువురు సంబరాలు చేసుకున్నారు. ఇదంతా సరైన ప్రవర్తన కాదు. ఈ విధానం మారాలి. కనీసం క్రీడల్లోనైనా వీటికి మినహాయింపు ఇవ్వాలి. మన గెలుపును ఆస్వాదించాలి. కానీ ఇతరుల ఓటమిని కాదు. దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏం ఉంటుంది? క్రీడా స్పూర్తితో ఉండే ఎవరూ ఇలా చేయరు.

సోషల్ మీడియా ఫాలోవర్లు, ఫేమ్ కోసం ఇలా చేయడం ఏ మాత్రం సరికాదు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఆ మ్యాచ్లో ఎవరో ఒకరు గెలుస్తారు. అప్పుడు సంబరాలు చేసుకుంటే ఓ అర్థం ఉంటుంది. కానీ ఇతర జట్ల ఓటమిని ఆస్వాదించడం పైశాచిక ఆనందమే అవుతోంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.