న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కపిల్ దేవ్ నిజంగా కిడ్నాప్ అయ్యారా? అని ప్రశ్నిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సైతం ఇదే ప్రశ్న వేసాడు.
కపిల్ దేవ్ కిడ్నాప్కు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన గంభీర్.. 'ఎవరికైనా ఈ వీడియో క్లిప్ వచ్చిందా..? ఇందులో ఉన్నది కపిల్ దేవ్ కాదనుకుంటున్నా. ఆయన సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నా'అని క్యాప్షన్గా రాసుకొచ్చాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కపిల్ దేవ్ను చేతులు వెనక్కు కట్టి, నోటికి బట్ట కట్టి లాక్కెళ్తున్నారు. వెనక్కు చూసిన కపిల్ దేవ్ ఏవో సైగలు చేస్తూ కనిపించాడు.

అయితే ఈ వీడియో ఓ అడ్వర్టైజ్మెంట్ కోసం చిత్రీకరించారని కొందరు అంటుంటే.. ఇది మార్ఫింగ్ వీడియో అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కపిల్ దేవ్ సురక్షితంగా ఉన్నారని, ఇది జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇంకొందరు తీసిపారేస్తున్నారు. కపిల్ దేవ్ కిడ్నాప్ అయితే పరిస్థితి గందరగోళంగా ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇది అడ్వర్టైజ్మెంట్ స్టంట్ అని, జనాలను పిచ్చోళ్లను చేసేందుకు కంపెనీలు ఎంతకైనా దిగుజారుతాయి అనేందుకు ఈ వీడియో నిదర్శనమని అభిమానులు మండిపడుతున్నారు. ఈ తరహా వీడియోలు గతంలోనూ వైరల్ అయ్యాయని, ఆ తర్వాత ఇవన్నీ వ్యాపార ప్రకటనలుగా తేలాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ వీడియోపై కపిల్ దేవ్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది.
ఇక కపిల్ దేవ్ చివరిసారిగా ప్రధాని నరేంద్రమోదీతో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కనిపించారు. ప్రధానితో పాటు తన సహచర ఆటగాళ్లు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లతో కలిసి వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. శివుడి రూపం ప్రతిబింబించేలా ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.