ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని ఉద్దేశించిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేసాడు. మెగా టోర్నీకి ఇంకా మూడు నెలల సమయమే ఉందని ఆటగాళ్లు అన్ని విధాల సిద్దంగా ఉండాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
'మా డ్రెస్సింగ్ రూం.. పారదర్శకంగా ఉంటుంది. మేం దాన్ని అలానే కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాం. టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం మేం పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉంది. మన చేతిలో ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ ప్రాముఖ్యాన్ని ఆటగాళ్లంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నా.'అని గంభీర్ సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. భారత్తో పాటు శ్రీలంక ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. పాకిస్థాన్ తుది పోరుకు అర్హత సాధిస్తే.. ఫైనల్ కూడా శ్రీలంక వేదికగానే జరగనుంది.
భారత్ వేదికగా ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. పాకిస్థాన్ తుది పోరుకు చేరకపోతే.. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది. అయితే మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు సౌతాఫ్రికా, న్యూజిలాండ్తో టీమిండియా ఐదేసి టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు సిరీస్లు భారత్ వేదికగానే జరగనున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ను భారత్2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి కోల్కతా వేదికగా టీమిండియా తొలి టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత టెస్ట్ ప్లేయర్స్ ఆస్ట్రేలియా నుంచి నేరుగా కోల్కతా చేరుకున్నారు.