IND vs NZ, CWC 2023: ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపచకప్కు తెలుగు తేజం అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. నెంబర్ 4లో సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగల రాయుడిని పక్కనపెట్టి అప్పటి సెలెక్షన్ కమిటీ ఘోర తప్పిదం చేసిందని మండిపడ్డాడు.
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సెలెక్షన్ కమిటీ ఇదేనని విమర్శించాడు. టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ చివరి నిమిషంలో ప్రపంచకప్ జట్టు నుంచి అంబటి రాయుడిని తప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగగా.. ఈ తప్పుడు నిర్ణయం ఎమ్మెస్కే ప్రసాద్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

జట్టు సెలెక్షన్కు సంబంధించి చర్చ జరిగినప్పుడుల్లా ఎమ్మెస్కే కమిటీ చేసిన తప్పిదం ప్రస్తావనకు వస్తోంది. ఏడాది పాటు అంబటి రాయుడిని ఆడించిన టీమిండియా.. ప్రపంచకప్ ముందు అతని స్థానంలో ఆల్రౌండర్ అయిన విజయ్ శంకర్ను తీసుకుంది. త్రీ డైమన్షన్ ప్లేయర్ అంటూ ఎమ్మెస్కే మీడియా సమావేశంలో తమ నిర్ణయాన్ని సమర్థించుకోవడం వివాదాస్పదమైంది.
ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన రాయుడు.. త్రీడీ గ్లాసెస్తో ప్రపంచకప్ చూస్తానని సెటైర్లు పేల్చాడు. ఆ కోపంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి.. మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో ఎమ్మెస్కేపై బాహటంగానే విమర్శలు గుప్పించాడు. కెరీర్ ప్రారంభంలో జరిగిన వివాదాలను మనసులో పెట్టుకొని తన కెరీర్ను అడ్డుకున్నారని ఆరోపించాడు.
2019 వన్డే ప్రపంచకప్లో టీమిండియా.. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఓడి ఇంటిదారి పట్టింది. టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలగా.. జడేజా, ధోనీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి పోరాటం భారత విజయానికి సరిపోలేదు. రాయుడి ఉండి ఉంటే ఆ మ్యాచ్లో భారత్ గెలిచేదనే అభిప్రాయం ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉంది.
తాజా ప్రపంచకప్లో ఆదివారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగ్గా.. గౌతమ్ గంభీర్ 2019 ప్రపంచకప్ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే ఎమ్మెస్కే ప్రసాద్ సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
'2019 సెలెక్షన్ కమిటీ అత్యంత చెత్తది. ఏడాది పాటు అంబటి రాయుడిని ఆడించి చివరి నిమిషంలో కారణం లేకుండా అతన్ని ప్రపంచకప్ నుంచి తప్పించడం అన్యాయం. ఈ నిర్ణయానికి అప్పటి టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఓ కారణం కావొచ్చు.'అని గౌతమ్ గంభీర్ కామెంట్రీ చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో అప్పటి టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పక్కనే ఉండడం విశేషం.