
న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్లో వికెట్ కీపర్.. ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగలేడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న రిషభ్ పంత్ను పక్కనపెట్టి కేఎల్ రాహుల్తో కీపింగ్ చేయించాలని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు గంభీర్ ఇలా బదులిచ్చాడు. గత కొన్ని రోజులుగా రిషభ్ పంత్ దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్లో కూడా పంత్(26) తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో టెస్ట్లో క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి నిర్లక్ష్యపు షాట్తో పెవిలియన్ చేరాడు. దాంతో పంత్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తుది జట్టులో నుంచి అతన్ని తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది.
పంత్ వైఫల్యంపై స్టార్ స్పోర్ట్స్ షోలో చర్చ జరగ్గా.. ఓ అభిమాని కేఎల్ రాహుల్తో కీపింగ్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన గంభీర్.. టెస్ట్ క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్మన్ కీపింగ్ చేయడం కుదరదన్నాడు. టెస్ట్ల్లో అతను ఓపెనర్గా కొనసాగినన్నాళ్లు రాహుల్ కీపింగ్ చేయలేడని, సుదీర్ఘ ఫార్మాట్లో కీపింగ్ చేసి.. ఓపెనర్గా బ్యాటింగ్ చేయడం అంత సులువైన పనికాదన్నాడు.
'రాహుల్ ఓపెనర్గా ఉంటే వికెట్ కీపింగ్ చేయలేడు. వికెట్ కీపింగ్ చేస్తే ఓపెనర్గా బరిలోకి దిగలేడు. 150 ఓవర్ల పాటు కీపింగ్ చేసి ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ను ఎదుర్కొవడం సులువైన పనికాదు. వన్డే, టీ20 ఫార్మాట్లో ఇది వర్కౌట్ అయినా.. టెస్ట్ క్రికెట్లో మాత్రం కుదురదు. అందుకే సుదీర్ఘ ఫార్మాట్లో రెగ్యులర్ వికెట్ కీపర్ ఉండాల్సిందే. ఒక వేళ రాహుల్ కీపింగ్ చేయించినా.. ఎక్కువ కాలం ఆడలేడు. టెస్ట్ క్రికెట్లో కొత్త బంతిని ఎదుర్కొని రిథమ్ అందించే ఓపెనర్లు కీపింగ్ చేయలేరు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
17/1 ఓవర్నైట్ స్కోర్ రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. మూడు వికెట్లు కోల్పోయినా.. క్రీజులోకి వచ్చిన పీటర్సన్(36 బ్యాటింగ్), డసెన్(14 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు నడిపిస్తున్నారు. ఓవర్నైట్ బ్యాట్స్మన్ మార్క్రమ్(8)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. నైట్ వాచ్మన్ కేశవ్ మహరాజ్(25)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. 35 ఓవర్ల ముగిసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్లకు 100 పరుగులు చేసింది. ఇక బ్యాట్స్మన్ దారుణంగా విఫలమవడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 77.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 79) అర్ధ సెంచరీ సాధించగా, చతేశ్వర్ పుజారా (77 బంతుల్లో 7 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు. రబడా 73 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జాన్సెన్కు 3 వికెట్లు దక్కాయి.