న్యూఢిల్లీ: ఐపీఎల్-2021 సీజన్ రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేయడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ధోనీకి ఐపీఎల్లో నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొవడం ఇబ్బందవుతుందని అభిప్రాయపడ్డాడు. కరోనాతో అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను యూఏఈ వేదికగా పూర్తి చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్తో రెండో దశ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో పాల్గొన్న గంభీర్.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ధోనీ సాధారణంగా నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కానీ, ఐపీఎల్-2021 మొదటి దశలో ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. కొన్నిసార్లు అతని కన్నా ముందు సామ్ కరన్ వచ్చిన సందర్భాలున్నాయి. ధోనీ పరుగులు చేయడం చాలా కష్టం. ఐపీఎల్ చాలా క్లిష్టమైన టోర్నీ. ఇది కరేబియన్ ప్రీమియర్ లీగ్ లేదా మరో టోర్నీలా కాదు. ఇందులో అత్యుత్తమ బౌలర్లు ఆడుతుంటారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కి దూరమైన ధోనీ.. వారిని ఎదుర్కొని పరుగులు చేయడం కష్టం. కాబట్టి.. ధోనీ నుంచి చెన్నై టాప్ ఆర్డర్ ఎక్కువగా ఆశించకూడదు. మరోవైపు ధోనీ కూడా వికెట్ కీపింగ్, జట్టు మెంటార్ పాత్రని పోషించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
2019 ఐపీఎల్లో ధోనీ 416 పరుగులు సాధించి సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత.. 2020 ఐపీఎల్లో 14 మ్యాచులు ఆడి 200 పరుగులు చేశాడు. ఇక, 2021 తొలి దశ ఐపీఎల్లో ఏడు మ్యాచులు ఆడి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అక్టోబరులో మొదలవనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టుని బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ జట్టుకు మెంటార్గా ధోనీని బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే.
హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్, బ్యాటింగ్ కోచ్లు ఉండగా మెంటార్గా ధోనీ చేసేదేం ఉండదన్నాడు. బహుషా ఒత్తిడిని అధిగమించడం ఎలానో బాగా తెలుసనే కారణంతోనే మహీని మెంటార్గా ఎంపిక చేసి ఉండవచ్చని వివాదాస్పద రీతిలో చెప్పుకొచ్చాడు. 'ఇందులో ధోనీ పాత్ర ఎంతో తెలియాల్సి ఉంది. ఇప్పటికే జట్టుకు ప్రధాన కోచ్, అసిస్టెంట్ కోచ్, బౌలింగ్ కోచ్ ఉన్నారు. కాబట్టి కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలు కాకుండా.. కొత్తగా అతడికి ఏదైనా ప్రత్యేకత ఉండాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే టీ20ల్లో టీమిండియా విజయవంతంగా కొనసాగుతోంది. కానీ, కష్టాల్లో లేదు. ఒకవేళ పొట్టి ఫార్మాట్లో భారత్ జట్టుకు నిలకడ లేకపోతే బయట నుంచి ఎవర్ని అయినా తీసుకోవచ్చు.
బహుశా.. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ధోనీ.. మెంటార్గా వ్యవహరిస్తే జట్టుకు మంచి జరుగుతుందని టీమ్మేనేజ్మెంట్ భావించి ఉండొచ్చు. అయితే ధోనీ ఎంపిక నైపుణ్యం పరంగా జరిగింది కాదు. ఎందుకంటే భారత జట్టులోని క్రికెటర్లందరూ నైపుణ్యం కలిగినవారే. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ధోనీ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ల్లో ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసు కాబట్టి.. ఆటగాళ్లకు అది ప్రయోజనంగా మారొచ్చు.'అని గంభీర్ పేర్కొన్నాడు.