
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్పై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో కగిసో రబడా, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి దిగ్గజ పేసర్లతో చాహల్ పోటీపడుతున్నాడని కొనియాడాడు. వారందరిలో కంటే చాహలే గ్రేట్ అని, అందరి బౌలర్ల కన్నా అతన్నే ఎక్కువగా ప్రశంసించాలన్నాడు. ఈ బెంగళూరు స్పిన్నర్ గురించే ఎక్కువగా మాట్లాడాలని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోతో ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు.
చాహల్ అద్భుతంగా రాణిస్తున్నా.. అతనికి రావాల్సిన పేరు రావడం లేదని, రబడా, బుమ్రా గురించి మాట్లాడినట్లు చాహల్ గురించి మాట్లాడటం లేదన్నాడు.'యుజ్వేంద్ర చాహల్ బ్రిలియంట్ బౌలర్. మనమెప్పుడూ రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, రబడా, కమిన్స్ గురించే మాట్లాడుతాం. కానీ చాహల్ కూడా ఐపీఎల్ ఆడుతున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్లో అతను అదరగొడుతున్నాడు. ఖచ్చితంగా మనం అతన్ని ప్రశంసించాలి. చాహల్ గురించి మరింత ఎక్కువగా మాట్లాడాలి. ఆర్సీబీ తరఫున రాణిస్తున్నా.. ఇతర బౌలర్లకు వచ్చినంత హైప్ రావడం లేదు'అని గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.

ఇక ఈ సీజన్లో చాహల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 18 సగటుతో 8 వికెట్లు తీసాడు. ఇందులో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఉన్నాయి. పర్పుల్ క్యాప్ రేసులో రబడా 12 వికెట్ల తర్వాత చాహలే ఉన్నాడు. ఇక సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యచ్లో ఆర్సీబీ 59 పరుగులతో చిత్తయిన విషయం తెలిసిందే.