ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనతోనే నాకౌట్ మ్యాచ్ల్లో విజయం సాధించామని కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మెంటార్ గౌతమ్ గంభీర్ అన్నాడు. మిచెల్ స్టార్క్ తమకు ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతాడని ఊహించే అతనిపై కోట్లు కుమ్మరించామని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫయర్-1, ఫైనల్లో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. ఈ సీజన్ మొత్తం విఫలమైన అతను.. కీలక నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం 5 వికెట్లు పడగొట్టి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో మిచెల్ స్టార్క్ వేసిన బంతికి సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఈ బంతిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. బాల్ ఆఫ్ ది ఐపీఎల్ అంటూ నెటిజన్లు కొనియాడారు. తాజాగా మిచెల్ స్టార్క్ ప్రదర్శనపై గంభీర్ స్పందించాడు. అయితే క్రికెట్లో ఆడలేని బాల్ అంటూ ఏదీ ఉండదని చెప్పాడు.
'మిచెల్ స్టార్క్ మాకు అత్యంత కీలకమైన బౌలర్ అని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. ఆరంభంలో అతను ఇబ్బంది పడ్డాడు. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం తీసుకున్నాడు. కానీ, సరైన సమయంలో టచ్లోకి వచ్చాడు. ఐపీఎల్లో భారీ మ్యాచ్లు అంటే క్వాలిఫయర్, ఫైనల్. ఈ నాకౌట్ మ్యాచ్ల్లో రాణిస్తేనే టైటిల్ గెలవగలం.
మా జట్టు విషయంలో అదే జరిగింది. మిచెల్ స్టార్క్ అసాధారణ ప్రదర్శన మమ్మల్ని విజేతగా నిలబెట్టింది. చాలా మంది అభిషేక్ శర్మను ఔట్ చేసిన బంతిపై మాట్లాడారు. ఇలాంటి బంతిని సంధించిన బౌలర్ను అభినందించకుండా ఉండలేం. క్రికెట్లో అతి తక్కువ బంతులను మాత్రమే ఆడలేం అనుకుంటాం.
స్టార్క్ వేసిన బంతి కూడా ఆ కోవలోకి వస్తుంది. అయితే ఆ బంతి ఆడలేనిదని నేను చెప్పలేను. ఎందుకంటే క్రికెట్లో ఆడలేని బంతి ఏది లేదనే మనం ఆటను నేర్చుకుంటాం. మిచెల్ స్టార్క్కు పెట్టిన ధరపై చాలా రకాల వాదనలు వినిపించాయి. అంత ధర అవసరమా? అనే విమర్శలు వచ్చాయి. కానీ స్టార్క్ మా ఎక్స్ ఫ్యాక్టర్.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో స్టార్క్ 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసాడు. క్వాలిఫయర్-1లో మూడు వికెట్లు తీసిన అతను ఫైనల్లో 2 వికెట్లతో సన్రైజర్స్ పతనాన్ని శాసించాడు.