వ్యక్తి పూజ ఎక్కువైతే ఫలితాలు ఇలానే ఉంటాయి: గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాకు ఎదురైన ఓటమిపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. వ్యక్తి పూజ ఎక్కువైతే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయన్నాడు. భారత్లో జట్టును అభిమానించే వారి కంటే ఆటగాళ్లను నెత్తిన ఎక్కించుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిపాడు. దాంతోనే టీమిండియాకు ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో ఆదివారం ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా పేలవ ఆట తీరుతో 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంపై న్యూస్ 18 ఛానెల్తో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'మన దేశం జట్టు విజయాల కంటే.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలనే కీర్తిస్తోంది. జట్టు కంటే వారే గొప్పని చాటి చెబుతోంది. ఇతర జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా దేశాల్లోని ప్రజలు మాత్రం ఆటగాళ్ల కంటే జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
1983 ప్రపంచకప్ గెలవడంలో మోహిందర్ అమర్నాథ్ కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్తో పాటు ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అయితే ఎంత మందికి ఈ విషయం తెలుసు. 1983 ప్రపంచకప్తో అతను ఉన్న ఫొటోను ఎవరైనా చూశారా? 1983 ప్రపంచకప్ గురించి మాట్లాడినప్పుడల్లా కపిల్ దేవ్ చేతిలోని ట్రోఫీని మాత్రమే చూపిస్తారు.
ప్రజలు తరుచూ ధోనీ, కోహ్లీతో మీ రిలేషన్ ఎలా ఉందని ప్రశ్నిస్తారు. ధోనీ, కోహ్లీతో ఉన్న నా రిలేషన్ గురించి అందరికి నేను చెప్పేది ఒక్కటే. మా మధ్య ఏమైనా వాగ్వాదం జరిగితే అది మైదానం వరకే. ఆఫ్ ద ఫీల్డ్లోకి తీసుకురాను. వ్యక్తిగతంగా తీసుకోను. ఎందుకంటే కోహ్లీకి విజయం కావాలి. నాకు అదే కావాలి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను అభిమానులను నెత్తిన పెట్టుకున్నారని గంభీర్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఈ ముగ్గురి స్టార్ డమ్ వల్ల సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుందని గంభీర్ చెప్పకనే చెప్పాడు. జట్టు కంటే ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదని సూచించాడు.
444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్కు ఓ వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications