ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణిస్తారని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. దేశం తరఫున పరుగులు చేసేందుకు ఈ ఇద్దరూ ఆకలితో ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.
బీసీసీఐ ఆదేశాలతో దేశవాళీ క్రికెట్లో బరిలోకి దిగిన ఈ ఇద్దరూ తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలోనే వారి ఫామ్పై ఆందోళన నెలకొంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజయంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తారని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. శనివారం జరిగిన బీసీసీఐ నమాన్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్.. కోహ్లీ, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ ఇద్దరూ జట్టుకు ఎంతో విలువను తీసుకొచ్చారని తెలిపాడు.

'ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ ఇద్దరూ దేశం తరఫున సత్తా చాటాలనే ఆకలితో ఉన్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం వారికి ప్యాషన్. వన్డే ప్రపంచకప్తో పోల్చితే ఛాంపియన్స్ ట్రోఫీలో విభిన్నమైన సవాళ్లు ఉంటాయి. ప్రతీ మ్యాచ్ నాకౌట్ లాంటిదే. రేసులో నుంచి వెనకడుగు వేయలేం. ఈ టోర్నీలో విజేతగా నిలవాలంటే మేం శుభారంభం చేయాలి. 5 మ్యాచ్లు గెలవాలి. నా దృష్టిలో రోహిత్, కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్, భారత క్రికెట్కు ఎంతో విలువను తీసుకొచ్చారు. కాబట్టి వారితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా గెలవాలనే కసితో ఉండాలి.
ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో జరిగే మ్యాచ్ కోసమే ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగడం లేదు. ఈ టోర్నీలో ఆడబోయే ఐదు మ్యాచ్లు మాకు ముఖ్యమే. దుబాయ్ వెళ్లి అన్ని మ్యాచ్లు గెలవడమే మా లక్ష్యం. టోర్నీ మధ్యలో పాకిస్థాన్తో మ్యాచ్ ఉండి ఉంటే సీరియస్గా తీసుకునేవాళ్లం. భారత్, పాకిస్థాన్ తలపడుతున్నప్పుడు భావోద్వేగాలు తారా స్థాయిలో ఉంటాయి. కానీ పోటీ ఇతర మ్యాచ్ల్లానే ఉంటుంది. కేవలం బ్యాట్, బంతి మధ్య పోటీ మాత్రమే. నాకు కూడా భారత్-పాక్ పోరు అలానే అనిపిస్తోంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.