పల్లెకెలె: విరాట్ కోహ్లీ అభిమానులకు తాను మిడిల్ ఫింగర్ చూపించానని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఖండించాడు. కోహ్లీ.. కోహ్లీ అని అరిచినందుకు తాను మిడిల్ ఫింగర్ చూపించలేదని, భారత్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతోనే అలా రియాక్ట్ అయ్యానని గంభీర్ స్పష్టం చేశాడు.
ఆసియాకప్ 2023లో గౌతమ్ గంభీర్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా మైదానం నుంచి వెళ్లిపోతున్న గంభీర్ను చూసి అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ గట్టిగా అరిచారు. ఈ స్లోగన్స్తో ఆగ్రహానికి గురైన గంభీర్.. కోహ్లీ అభిమానుల వైపు మిడిల్ ఫింగర్ చూపించాడు.

ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో దుమారం రేగింది. గంభీర్పై కోహ్లీ ఫ్యాన్స్తో పాటు క్రికెట్ ప్రేమికులు, రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ మెంబర్ అయిన గంభీర్ ఇలా దిగజారి ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెటర్గా ఎంతో అనుభవం ఉన్న గంభీర్కు ఫ్యాన్స్ ఏమోషన్ అర్థం కావా? అని విమర్శించారు.
సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలు వస్తుండటంతో గంభీర్ స్పందించాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో జాతీయ మీడియాతో మాట్లాడాడు. 'సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది వాస్తవం కాదు. మ్యాచ్కు వచ్చిన ప్రేక్షకులు భారత్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతోనే మిడిల్ ఫింగర్ చూపించాను.
'హిందూస్తాన్ ముర్తాబాద్'తో పాటు కశ్మీర్ గురించి కామెంట్స్ చేయడంతో అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దేశాన్ని కించపరిచనప్పుడు ఇలా రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి. మ్యాచ్కు వచ్చిన అభిమానులు ఆటను చూడాలి. అంతేకాని రాజకీయాలు మాట్లాడుతూ.. మరో దేశాన్ని కించపర్చేలా స్లోగన్స్ ఇవ్వడం సరికాదు. కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియా వేదికగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అనని వ్యాఖ్యలను కూడా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. 'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
భారత్తో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిష్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్కు కలిసొచ్చింది.