ఎంత పెద్ద ఆటగాళ్లు అయినా జట్టు తర్వాతేనని, టీమ్ కంటే ఎవరూ ముఖ్యం కాదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండటాన్ని ప్రశంసించాడు. కెప్టెన్గా రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడని, ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని కొనియాడాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ 3-1తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖవాజా(45 బంతుల్లో 4 ఫోర్లతో 41)రాణించగా.. ట్రావిస్ హెడ్(38 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్), బ్యూ వెబ్స్టర్(34 బంతుల్లో 6 ఫోర్లతో 39) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/69) ఒక్క వికెట్ పడగొట్టాడు. గాయంతో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం ఆసీస్కు కలిసొచ్చింది.
ఈ పరాజయం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్.. ఆఖరి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు.
'ఓ మ్యాచ్కు కెప్టెన్గా దూరంగా ఉండటం తప్పు కాదు. జట్టు కంటే ఎవరూ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ అందరికి తెలిసేలా చేశాడు. చివరి టెస్ట్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మపై రిపోర్ట్లను రాసేటప్పుడు కాస్త తెలివిగా వ్యవహరించాల్సింది.'అని గౌతమ్ గంభీర్ రిపోర్టర్లకు చురకలంటించాడు.
సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై తాను మాట్లాడలేనని గంభీర్ స్పష్టం చేశాడు. 'ఆటగాళ్ల భవిష్యత్తుపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను. అది వారి వ్యక్తిగత నిర్ణయం. వారికి ఆటపై ప్రేమ, కమిట్మెంట్ ఉన్నాయి. భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడానికి వారు చేయగలిగినదంతా చేయగలరని ఆశిస్తున్నాను.
టీమ్ ట్రాన్సిషన్ గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఐదు నెలల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు. ప్రతీ ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేశవాళీ క్రికెట్ ఆడే సమయం ఉంటే.. రెడ్ బాల్ క్రికెట్ ఆడాలనే నిబద్దత ఉంటే ఎవరైనా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే.
నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించారు. మహమ్మద్ సిరాజ్ కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ప్రతీ బంతికి పరుగెత్తే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. 100 శాతం రాణించకపోయినా..అతను వెనక్కి తగ్గలేదు. అటిట్యూడ్ విషయంలో సిరాజ్ అద్భుతం.'అని గంభీర్ కొనియాడాడు.