
న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్తో పొట్టి ఫార్మాట్ కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన హిట్ మ్యాన్ కెప్టెన్గా బ్యాట్స్మన్గా దుమ్మురేపాడని గంభీర్ కొనియాడాడు. గత ఆదివారం జరిగిన ఆఖరి టీ20లోనూ భారత్ విజయం సాధించి మూడు టీ20ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ ఫలితంపై స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గంభీర్.. రోహిత్ కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. కెప్టెన్గా ఒత్తిడిని దరిచేరనీయకుండా చాలా స్వేచ్ఛగా ఆడాడని అభిప్రాయపడ్డాడు.
'రోహిత్ నిలకడగా రాణిస్తూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాక కూడా అలాగే రాణించడం శుభపరిణామం. అతని ఆటతీరు టీమిండియాకు పెద్ద సానుకూల అంశం. ఎందుకంటే కొన్నిసార్లు కెప్టెన్సీ ఆయా ఆటగాళ్ల స్వేచ్ఛను హరిస్తుంది. అది రోహిత్ విషయంలో జరగలేదు. అతను ఇంతకుముందు కెప్టెన్సీ చేసినా అది పూర్తిస్థాయిలో కాదు. ఈ సిరీస్తో అతని పరిణతి ఏంటో తెలిసొచ్చింది. రోహిత్ శర్మ రాణించడం ఆశ్చర్యం కలిగించకపోయినా.. ఫుల్టైమ్ కెప్టెన్గానూ స్వేచ్ఛగా ఆడిన విధానమే ఆకట్టుకుంది' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఎంతో అదృష్టవంతుడని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్లో లేకపోయినా అతను జట్టులో కొనసాగుతున్నాడని తెలిపాడు. వైస్ కెప్టెన్ హోదాలోనే అతను ఇంకా జట్టులో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గంభీర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ''మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్లను ఓపెనర్లుగా పంపితే బాగుంటుంది. అలా అయితే నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్ను పంపాల్సి ఉంటుంది. ఇక రహానే విషయానికొస్తే.. నిజంగా తను అదృష్టవంతుడు. అవసరమైనపుడు సారథిగా వ్యవహరిస్తున్నందుకే తనకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను.
అయితే, కనీసం ఈసారైనా తను ఈ ఛాన్స్ను చక్కగా వినియోగించుకోవాలని ఆశిస్తున్నా'' అని పేర్కొన్నాడు. ఇక తెలుగు క్రికెటర్ హనుమ విహారిని ఎంపికచేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందన్న గంభీర్... ఇండియా 'ఏ' జట్టులో మాత్రం స్థానం ఎందుకని ప్రశ్నించాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో చక్కగా రాణించే విహారి.. రహానే లేదంటే మిడిలార్డర్లో ఎవరో ఒకరి స్థానాన్ని భర్తీ చేయగలడని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాడు.