రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టును ఓడించడం అంటే తనకు చాలా ఇష్టమని కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మెంటార్ గౌతమ్ గంభీర్ అన్నాడు. నిద్రలో కూడా ఆ జట్టునే కలవరిస్తానని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో శుక్రవారం కేకేఆర్ తలపడనుంది.
కలలో కూడా ఓడించాలనుకుంటా..
ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గౌతమ్ గంభీర్.. ఆర్సీబీ టీమ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'ఐపీఎల్లో నాకు ఒక జట్టును ప్రతీసారి ఓడించాలని ఉంటుంది. ఆ జట్టు పేరు ఆర్సీబీ. కలలో కూడా ఆర్సీబీని ఓడించాలనుకుంటా. ఆ జట్టును ఓడించడం అంటే నాకు చాలా ఇష్టం.

అత్యధిక అభిమాన గణం కలిగిన జట్టు కావడంతో నాకు అలా అనిపిస్తుందనుకుంటా. ఆ జట్టు ఓనర్తో పాటు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ల కారణంగా ఆర్సీబీ అత్యంత ఆదరణ పొందింది. ఒక్క టైటిల్ గెలవకున్నా.. అన్ని సాధించామనే వైఖరితో ఉంటారు. ఆ అటిట్యూడ్ను నేను స్వీకరించలేను.
ఆ మూడు మ్యాచ్లు ది బెస్ట్..
ఆర్సీబీపై కేకేఆర్ మూడు అత్యుత్తమ విజయాలు సాధించింది. ఐపీఎల్ తొలి మ్యాచ్లో బ్రెండన్ మెక్కల్లమ్ విధ్వంసం, ఆర్సీబీని 49 పరుగులకే ఆలౌట్ చేయడం.. మరో మ్యాచ్లో 6 ఓవర్లలోనే కేకేఆర్ 100 పరుగులు చేయడం. బహుషా ఐపీఎల్ చరిత్రలోనే 6 ఓవర్లలో 100 పరుగులు చేయడం అదే తొలిసారి అనుకుంటా. ఆ జట్టు బలమైనదని, దూకుడైన బ్యాటింగ్ లైనప్ ఉందనే విషయం మాకు తెలుసు. నేను మళ్లీ క్రికెట్ మైదానంలోకి వెళ్లి ఆర్సీబీని ఓడించేందుకు ఇష్టపడుతాను.
ఆర్సీబీ జీరో..
ఆర్సీబీ జట్టుకు కేకేఆర్కు ఏ మాత్రం పోటీ కాదు. ఎందుకంటే కేకేఆర్ రెండు టైటిల్స్ గెలిస్తే ఆర్సీబీ ఒక్కటి కూడా గెలవలేదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్ కెప్టెన్గా గంభీర్ ఉన్నప్పుడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో గొడవపడ్డాడు. అప్పటి నుంచి కోహ్లీ అంటే గంభీర్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడు.
గతేడాది లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరించిన గంభీర్.. విరాట్ కోహ్లీతో మైదానంలో గొడవపడ్డాడు. ఆ సీజన్లోనే ఈ గొడవ అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిపోయింది.
ఈ గొడవ కారణంగా గంభీర్.. లక్నోను వదిరి కేకేఆర్లో చేరినట్లు ప్రచారం జరిగింది. ఈ గొడవ తర్వాత గంభీర్, కోహ్లీ మళ్లీ ఈ సీజన్లోనే ఎదురుపడుతున్నారు. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.