టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డే ప్రపంచకప్ గెలవకపోయినా.. ఈ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడాడు. ఒక్క ఓటమితో రోహిత్ శర్మను చెత్త కెప్టెన్ అంటే ఎలా? అని ప్రశ్నించాడు.
అప్కమింగ్ టీ20 ప్రపంచకప్లో టీమిండియా విజేతగా నిలవాలంటే రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని సూచించాడు. ఆటగాళ్ల వయసు కన్నా ఫామ్ ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

'రోహిత్ శర్మ గొప్ప సారథి. ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవడం అంత సులువైన పని కాదు. ఈ వన్డే ప్రపంచకప్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన తీరు అద్భుతం. ప్రపంచకప్ ఫైనల్కు ముందు కూడా నేను ఇదే విషయం చెప్పాను. ఫైనల్లో టీమిండియా ఓడినా.. ఛాంపియన్లా ఆడింది. ఈ ఒక్క ఓటమి రోహిత్ శర్మను బ్యాడ్గా మార్చదు.
పది మ్యాచ్ల్లో టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబర్చింది. ఒక్క ఓటమి కారణంగా రోహిత్ శర్మను చెత్త కెప్టెన్ అనడం ఏ మాత్రం సరికాదు. రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉంటే వయసును చూడకుండా అతన్ని టీ20 ప్రపంచకప్ 2024 జట్టు సారథిగా కొనసాగించాలి. ఫామ్లో లేకపోతే మాత్రం ఎంపిక చేయవద్దు.
ఆటగాళ్ల ఎంపిక ఎప్పుడూ ఫామ్ ఆధారంగానే ఉండాలి తప్పా వయసును బట్టి కాదు. మంచి విషయం ఏంటంటే.. ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఐపీఎల్లో రాణించి ఫామ్ లో ఉన్న వాళ్లను వరల్డ్ కప్కు ఎంపిక చేయాలి. రోహిత్, కోహ్లి ఐపీఎల్ లో రాణిస్తే.. వయస్సును ఆలోచించకుండా సెలక్ట్ చేయాలి.'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం టీమిండియాకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, కోహ్లీ.. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ నేడు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలతో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నాడు.