ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా విరాట్ కోహ్లీతో జరిగిన గొడవపై ప్రశ్నించిన ఓ జర్నలిస్ట్పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ గొడవపై ఎన్నిసార్లు ప్రశ్నించినా తన సమాధానం మారదని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ గొడవపడ్డారు. ఈ గొడవ చివరకు గంభీర్-కోహ్లీ మధ్య వాగ్వాదానికి దారి తీసింది. మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు.

అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ గొడవపై అనేక ఇంటర్వ్యూల్లో గంభీర్ స్పందించాడు. అయితే తాజాగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్కు మళ్లీ ఈ గొడవ గురించే ప్రశ్న ఎదురైంది.
వన్డే ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ 50వ శతకం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి బౌలింగ్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడని గంభీర్ను సహచర కామెంటేటర్ అడిగాడు. 'ప్రపంచకప్ సెమీఫైనల్లో లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో కోహ్లీ సెంచరీ మార్క్ను తాకాడు.'అని గంభీర్ బదులిచ్చాడు.
వెంటనే సదరు కామెంటేటర్ మరోసారి ఐపీఎల్ గొడవకు సంఘటనను ప్రస్తావించాడు. దాంతో అసహనానికి గురైన గంభీర్..'మీరు పదే పదే ఆ క్లింప్పింగ్లను చూపించినా.. నా సమాధానం ఒక్కటే. కోహ్లీ అయినా వేరేవారైనా వాగ్వాదం అనేది కేవలం మైదానంలోనే'అని స్పష్టం చేశాడు.
వన్డే సిరీస్లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్పై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'సంజూ శాంసన్ అద్భుతమైన టాలెంట్ కలిగిన ప్లేయర్. ఐపీఎల్లో అతని ఆటతీరు గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్తో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు పునరుజ్జీవం వచ్చినట్లు అయింది.
దీనికి ముందు చాలా అవకాశాలు వచ్చినా ఒడిసిపట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఈ శతకంతో సెలెక్టర్లను ఆకట్టుకోవడమే కాకుండా వారిపై ఒత్తిడి తెచ్చాడు. అతను మరింత నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. సంజూకు వన్డే ఫార్మాట్లో కూడా అవకాశాలు ఇవ్వాలి'అని గంభీర్ సూచించాడు.